కురచదైపోతున్న కాలం

నాకు ఒక ఏడెనిమిదేళ్ళ వయసున్నపుడు, నేను మా చుట్టాల ఊర్లో పెరిగాను. తరువాత మా ఊరు వచ్చేశాను.
 నేను పెరిగి డిగ్రీ లోకి వచ్చిన తరువాత దాదాపు పదిహేనేళ్ళ కి మళ్ళీ మా చుట్టాల ఊరుకి వెళ్ళాను.
అక్కడ ఒక గమ్మత్తైన విషయం గమనించాను. అక్కడి పెరటి గోడలన్నీ  కురచవైపోయాయి. నా చిన్నప్పుడు దూరం గా ఉన్న ప్రదేశాలు దగ్గరగా జరిగాయి.
ఇదేంటబ్బా అని ఆలోచిస్తూ ఉండగానే నాకు విషయం అర్ధమైపోయింది. పెరటి గోడలు పొట్టివవ్వ లేదు, నేనే బారు పెరిగాను. దూరాలు దగ్గరవ్వలేదు నా కాలే బారు సాగింది.
 మనపై కాలం కూడా ఇలాంటి కనికట్టునే చేస్తుంది.

నేను ఎనిమిదో తరగతి లో ఉన్నపుడు, మా నాన్న ని దీపావళి కి బారు లాగూ (పాంటు) కొనిపెట్టమని అడిగాను. దానికాయన,”అప్పుడే వీడికి పాంటు కావలసి వచ్చిందంట, వచ్చేదీపావళి కి కొనిపెడతాలేరా!”, అని విసుక్కొన్నాడు.
నేను, “అమ్మో! పాంటు కోసం ఏకం గా సంవత్సరం ఆగాలా నాన్నా?” అన్నాను.
ఆయన, ” సంవత్సరం ఎంత సేపట్లో వస్తుంది. ఇలా చూస్తూ ఉండగానే గిరుక్కున తిరి వస్తుంది”, అన్నారు.
చిన్నప్పుడు ఎంతో బారు గా అనిపించిన సంవత్సరం ఇప్పుడు నాకు కూడా చాలా కురచ అయిపోయింది. ఎందుకంటే, చిన్నపుడు పన్నెండు సంవత్సరాలు ఉన్న నా మనసు ఎత్తు ఇప్పుడు పెరిగి పోయింది. అది ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాల ఎత్తుకు పెరిగింది. ఈ ఎత్తు ముందు,  సంవత్సరం అనే పెరటి గోడ కుంచించుకొని పిట్టగోడ లా అయిపోయింది.. ఇక నేను యాభై లలోకి అడుగు పెట్టటానికి.నా చిన్నప్పటి లెక్కలో చెబితే…, ఇంకా ఓక సంవత్సరం వ్యవధి కూడా లేదు. త్వరపడాలి లేక పోతే చూస్తూ ఉండగానే వార్ధక్యం లోకి అడుగుపెడతాను.

డర్టీ పిక్చర్, సిల్క్ స్మిత జీవితం,స్త్రీ వాదం, ..కొన్ని ప్రశ్నలూ సమాధానాలు

ఆడవారి అందాలను కమర్షియలైజ్ చేసి అమ్ముకోవటం ఇప్పటిది కాదు. అది మానవ జాతి అంత పాతది.కాకపోతే మన సినిమా వాళ్ళు దానిని మన పాపులర్ కల్చర్ తో మేళవించి మనకు స్లో పాయిజన్ లా ఎక్కిస్తున్నారు.
నేను నా ఫ్రెండ్ ఒకతనిని తో సినిమాల లో సెక్స్ గురించి వాపోతుంటే, అతను “మనం చేసే టప్పుడు లేని తప్పు ఎవరో చూపిస్తుంటే ఏమిటి? ఇది హిపోక్రసీ నే కదా?”, అన్నాడు.
అతని వాదన నాకు మరీ సింప్లిస్టిక్ గా అనిపించి, “హిపోక్రసీ అనేది సామాజిక విలువల కి  మాత్రమే వర్తిస్తుంది. మనం నాలుగు గోడల మధ్యా చేసే  పనులకి కాదు”, అని చెప్పబోయాను కానీ నా వాదన కి నేనే కన్విన్స్ కాలేదు.
“నెట్లో బూతు సినిమాలు చూసి ఆనందించే ప్రేక్షక సామాన్యానికి సినిమాల లో ని బూతు ని గురించి ఫిర్యాదు చేసే హక్కు ఎక్కడిది?”, అని కూడా అతను అన్నాడు.
నేను, “నిర్మాతలు ప్రేక్షకుల బలహీనతలను క్యాష్ చేసుకొంటున్నారు..”, అన్నాను.
“నెట్లో ఇవన్నీ ఫ్రీగానే వస్తాయి..అయినా నువ్వు నీ అభిమాన హీరో చేసే డాన్సులూ, ఫైట్లూ చూసి ఆనందిస్తావు. ఎవరైనా అది నీ బలహీనత అంటే నువ్వు ఒప్పుకొంటావా? నీ అభిమాన దర్శకుడు తీసిన సినిమా ని నువ్వు ఆనందిస్తావు.అది నీ బలహీనత కాదు. అలానే నీ అభిమాన తార గుడ్డలిప్పి చూపిస్తే నువ్వు ఆనందిస్తావు. ఇది కూడా నీ బలహీనత కాదు”,అన్నాడు.

ఈ మధ్యే ఏదో హిందీ సినిమా లో ఒంటిమీద నూలు పోగు లేకుండా నటించిన నగ్న కళా విదుషీమణి ని ఒక బుధ్ధిలేని విలేఖరి, “మీ సినిమా లో అసభ్యత ఎక్కువయింది అంటున్నారు..?”, అని ప్రశ్నిస్తే ఆమె, “అసభ్యత అనేది చూసే వారి కళ్ళలోనే ఉంటుంది”, అని దబాయించింది.

కొంత మంది నటీమణులు పాత్రస్వభావాన్ని బట్టి ఎక్స్-పోజింగ్ చేస్తున్నామనీ, తాము నిజజీవితం లో పతివ్రతలమనీ చెబుతారు!నిజ జీవితం లో, “లో దుస్తులు” బయటికి కనపడితేనే సిగ్గుతో చితికిపోయే వారు, పాత్రాపరం గా ఎక్స్-పోజింగ్ ఎలా చేయగలరు?ఒక పాత్ర ఎక్స్-పోజింగ్ చేయాలంటే దానిని పోషించే అసలు మనిషి కూడా ఎక్స్-పోజింగ్ చేయాలి కదా!అలానే ఆ వ్యక్తి ఎక్స్-పోజింగ్ ని సినిమా సెట్లోని ఇతర పాత్రల వెనుక ఉండే అసలు మనుషులూ,, టెక్నీషియన్లూ చివరికి ప్రేక్షకుల వెనుక ఉండే అసలు మనుషులూ చూస్తారు కదా?  ఒక్క డబ్బు కోసం పాత్రా పరమైన వెధవపనులు చేస్తున్నారంటే, వారు నిజ జీవితం లో కూడా ఇతర ప్రలోభాలకు లొంగి అలాంటి పనులు చేయగలరన్న మాట! ఒక పాత్ర యొక్క దుష్ట స్వభావాన్ని  ఆవాహన చేసుకొని నటించటం వేరు. దానికోసం అసలు మనిషి దుష్టుడు గా మారనవసరం లేదు. నిజ జీవితం లో చెడు పనులు చేయనవసరం లేదు. రావు గోపాల రావు,సూర్యకాంతం వంటి వారు సినిమాలలో దుష్ట పాత్రలు వేసినప్పటికినీ నిజ జీవితం లో సాత్వికులుగానే ప్రసిధ్ధి చెందారు. 

మానసిక స్థాయి లో అంతర్గతం గా మనలో ప్రతి ఒక్కరి లోనూ అనేక మంచీ చెడూ పాత్రలు ఉంటాయి. నటుడు సందర్భాను సారం గా తన లోని ఈ పాత్రలను ముందుకు తీసుకొని వచ్చి అభినయిస్తాడు.
అంతర్గతంగా ఉన్న మంచి పాత్రను బాహ్యం గా నిజ జీవితం లో మనం పోషించలేక పోవచ్చు, మన వ్యక్తిగత మనుగడ వంటి విషయాలు అడ్డు రావటం వలన. అలానే ,అంతర్గతం గా ఉన్న చెడు పాత్రని నిజ జీవితం లో మనం పోషించలేము. అలా పోషిస్తే పక్క వాడు మనకి దేహశుధ్ధి చేసి పోలీస్ కేస్ పెడతాడు కాబట్టీ. నిజ జీవితం లో మన బాహ్య వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దటం లో మన ఆచరణ ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఎక్స్-పోజింగ్ అనే భౌతిక మైన పని నిజం గానూ, పాత్రాపరం గానూ ఒకేసారి జరిగిపోతుంది. రెండిటినీ వేరు చేసి చూడలేము. కానీ వ్యక్తిత్వాన్ని అభినయించటం మానసికమైన పరిధిలోనిది. వేరే వ్యక్తిత్వాన్ని అభినయించి, మళ్ళీ కాసేపటికి తన నిజ జీవితం లో అసలు వ్యక్తి గా అవ్వవచ్చు.
మా  చుట్టాలలో ని ఒక ఫెమినిస్టు గారిని, “ఈ  అర్ధ నగ్న ప్రదర్శనలు చేసే వారూ ఆడవారే కదా?” అని అడిగాను.
దానికి ఆమె నామీద ఇంతెత్తున లేచి, ” మీ మగాళ్ళే పేద స్త్రీల బలహీనతను ఆసరాగా తీసుకొని వారి చేత ఇలాంటి పనులు చేయిస్తున్నారు”, అంది.

ఎందుకనో నాకు, ” తరతరాల నట వారసులైనటువంటి కరీనా కపూర్లూ, ఇంగ్లాండ్ నుంచీ ఊడిపడే కట్రీనా కైఫ్లూ పేదవారనుకోవటానికి మనసొప్పలా..! కాకపోతే సరదాగా ఖర్చు పెట్టుకోవటానికి ఓ రెండు మూడు కోట్ల పాకెట్ మనీ కోసం ఎక్స్-పోజింగ్ చేస్తే తప్పేమిటి?”, అనిపించింది. 
ఇక అసలు విషయానికి వచ్చేద్దాం, ఈ మధ్యే డర్టీ పిక్చర్ ని  నిర్మించిన బాలాజీ పిక్చర్స్ అధినేత్రి ఏక్తా కపూర్ కూడా ఒక స్త్రీనే కదా..?! ఆమె కూటికి గతి లేని పేద రాలు కాదు. కొన్ని వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి రాణి. మధ్య తరగతి విలువలను మనం ఆమె కు అంటగట్ట రాదు.ఆమె ఎగువ తరగతి కి చెందిన ప్రభావవంతమైన స్త్రీ.  ఆమె విలువలు డబ్బు చేతా, ప్రాక్టికల్ గా ఉండే సాధ్యాసాధ్యాల చేతా, న్యాయ వ్యవస్థ చేతా , ఆ పై ఆమె వ్యక్తిగత ఇష్టాఇష్టాల చేతా నిర్ణయింపబడతాయి. 
ఇక సిల్క్ స్మిత అమలాపురం దగ్గర ఒక పల్లె నుంచీ పొట్టచేత పట్టుకొని మద్రాస్ చేరి, సినిమాలలో శృంగార పాత్రలు వేసి గడుపుకొంది. పాపం, ఏ కష్టమొచ్చిందో ఏమో, ఆత్మహత్య చేసుకొంది. ఆమె శృంగార పాత్రలు తన అవసరాన్ని బట్టి వేసి ఉండవచ్చు. తన కడుపు కోసంకొన్ని అక్రమ సంబంధాలలో ఇన్వాల్వ్ అయి ఉండవచ్చు. కానీ ఆమె జీవితం లో కనిపించేది దయనీయత మాత్రమే. శృంగారం ఏ మాత్రం కాదు.

 అటువంటి సిల్క్ స్మిత జీవితం లోకి శృంగారాన్ని జొప్పించి డబ్బు చేసుకోవాలనుకొనే ఏక్తా కపూర్ కూడా ఒక స్త్రీనే. కాబట్టీ ధన జాఢ్యానికి లింగ వివక్ష లేదు. ఇది అన్ని తరగతులకీ సమానం గా వర్తిస్తుంది.
మధ్య తరగతినే తీసుకొందాం.టీ వీ ల లో అసభ్య దృశ్యాలు వచ్చినపుడు, “ఛీ.. ఛీ.. వీళ్ళకి అసలు విలువలే లేవు” అనుకోవటం చాలా సులువు. కానీ మన విలువలు వదిలి పెడితే మనకు డబ్బు వచ్చిపడుతున్నపుడు, మనం ఈ విలువల వలువలను వదిలి డబ్బు ఇచ్చిన కొత్త వలువలు వేసుకోవటానికి ఏమాత్రం సందేహించం.  ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో విప్పి చూపించిన విద్యా బాలన్ గారు మధ్య తరగతి నుంచే వచ్చారు.  ఈమె స్టూడియో లో చేసిన ఎక్స్పోజింగ్ చూడలేక ఈమె నాన్న గారు స్టూడియో బయటికి వచ్చి కారులో కూర్చొన్నారంట. ఆహా…! ఏమి మధ్య తరగతి విలువలూ ఎంత హిపోక్రసీ..? హిపోక్రసీ లేనిది ఒకటే ..అది డబ్బు..కాసుకు లోకం దాసోహం.. !

మొత్తానికి..తీసే వాళ్ళు తీస్తున్నారు, చేసే వాళ్ళు చేస్తున్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు, మధ్య లో మనకెందుకు బాధ? ప్రతి విషయం లోనూ మంచిని చూడాలంటారు..కాబట్టీ ఈ విషయం లో కూడా అలా చూడటానికి ప్రయత్నిద్దాం! పోనీలే.., సిల్క్ స్మిత జీవితం ఏదైనా, ఈ సినిమా వలన బాలాజీ పిక్చర్స్ లో పని చేసే వారికి కొంత కాలం కడుపైనా నిండుతుంది అని సరి పెట్టుకొందాం!

నేరమూ శిక్షా, చట్టాల పరిధులూ పరిమితులూ

అప్పట్లో న్యాయస్థానం రాజీవ్ గాంధీ హంతకులకు శిక్షలు విధించింది. గుంటూరు  శేషేంద్ర శర్మ గారు,”భగవద్గీతను ఉటంకిస్తూ, భగవంతుని ప్రమేయం లేకుండా ఏమీ జరుగదు. రాజీవ్ హంతకులు కూడా భగవంతుని ప్రమేయం తోనే హత్య చేసి ఉంటారు. కాబట్టీ ఆ హత్య లో వారు దోషులు కారు. వారిని శిక్షించ కూడదు.”, అని వాదిస్తూ ఒక వ్యాసం రాశారు. దానికి ఆయనను చాలా మంది విమర్శించారు.
అప్పట్లో నాకు ఆయన వాదన నిజమే కదా! అనిపించింది. ఇప్పుడు ఆలోచిస్తే దానికి కౌంటర్ గా ఇలా వాదించవచ్చు అనిపిస్తుంది. “న్యాయస్థానాలు కూడా భగవంతుడు సృష్టించిన జీవ కోటి నుంచీ పుట్టిన మానవ సమాజం లోనివే. భగవంతుని ఇఛ్ఛానుసారమే ఆ వ్యవస్థ కూడా నేరస్థులను అదుపులో పెట్టటానికి శిక్షలను అమలు చేస్తాయి. కాబట్టీ, ఆశిక్షలు కూడా భగవంతునికి వ్యతిరేకం కాదు.”

భగవంతుని విషయాన్ని కొంచెం సేపు పక్కన పెట్టి ఆలోచిద్దాం.
న్యాయాన్ని మానవ సమాజం తన దీర్ఘకాలిక మనుగద కోసం, సమాజం లో ఒక క్రమ పధ్ధతీ శాంతీ ఉండటం కోసం ఏర్పాటు చేసుకొంది.  అయితే ఈ న్యాయస్థానాలు నైతికమైన విషయాలలో  తీర్పులు ఇస్తాయి. ఒక సమాజం లో అనేక నీతులు ఉంటాయి.  నీతి ఒక్కోసారి వ్యక్తిగతం గా ఉంటుంది. మనిషి మనిషి కీ మారుతుంటుంది. మరి న్యాయస్థానాలు అమలు పరిచే నీతి ఎవరి నీతి?  అది అధిక సంఖ్యాకుల నీతి. ఒక్కోసారి అది బలవంతుల నీతి. ఒక సమాజం “ఒక్కరు కంటే ఎక్కువ భార్యలను కలిగి ఉండటం” నేరం అంటుంది.అదే సమాజం లో పెరిగిన వ్యక్తికి ఈ నియమం తెలుసు కాబట్టీ, అతను ఎప్పుడైనా వివాహేతర సంబంధానికి దగ్గరగా వచ్చినపుడు, గిల్టీ గా ఫీలవుతాడు.అంటే ఇక్కడ, అతని అంతరాత్మ యొక్క నీతీ, సమాజం నీతీ, న్యాయపరమైన నీతీ ఒక్కటే.తరువాత అతనిని న్యాయస్థానం శిక్షించినా, అది సబబే అని అతనికి అనిపిస్తుంది.

ఇస్లామిక్ దేశాలలో ఒకరు కంటే ఎక్కువ భార్యలను కలిగి ఉండటం నేరం కాదు. అక్కడ పెరిగిన వ్యక్తి  ముగ్గురిని పెళ్ళి చేసుకొని కూడా గిల్టీ గా ఫీలవడు. అతనిని  అమెరికా చట్టం ప్రకారం శిక్షిస్తే, ఆ చట్టం చేసింది సరి అయినది అని అతను ఫీలవకపోవచ్చు. అలానే, ఆదిమ, పురాణ పురుషులను ఇప్పటి సమాజ, న్యాయ విలువల తో తూచటం సరి కాదు. శ్రీకృష్ణుడు తన అనేక భార్యల గురించి గిల్టీ గా ఫీలవాలనుకోవటం సరి కాదు కదా!
“మనం మన విలువల తోనే అంచనా వేస్తాం! ఇంకెవరి విలువల తోనో మనం ఎలా అంచనా వేస్తాం?”, అని ఎవరైనా అడగవచ్చు.
మన కాలానికీ ఆ కాలానికీ ఉమ్మడిగా కొన్ని సార్వజనీనమైన మానవ విలువలు ఉంటాయి. ఆ విలువల ప్రకారం వారిని అర్ధం చేసుకోవాలి.తన బాణం వేటుకి ఒంటరైన పక్షిని చూసి బోయవాడైన వాల్మీకి శోకించటం ఇలాంటి సార్వజనీనమైన మానవ విలువే!

 సమాజం లోని కట్టుబాట్లూ విలువలూ తగ్గుతూ ఉంటే జనాలు న్యాయస్థానాల దగ్గరికి పరుగులు తీయటం ఎక్కువౌతుంది. ఇంకా సమాజ విలువలు కొద్దో గొప్పో ఉన్న మన గ్రామాలలో జనాలు కోర్టులకి వెళ్ళటం తక్కువ గా కనపడుతుంది. అలానే మానవీయ విలువలు తగ్గిన సమాజం లో  కట్టుబాట్లు దురాచారాల రూపం లో బిగుసుకొనిపోతాయి. అప్పుడే మానవీయ విలువలు ఉన్న సంఘ సంస్కర్తలు సమాజ నీతిని ఎదిరించైనా ఒక మార్పు తీసుకొని రావటానికి ప్రయత్నిస్తారు. ఈ సంస్కర్తలు చేసే పనులు మొదట సమాజం దృష్టి లో న్యాయ వ్యవస్థ దృష్టిలో నేరాలౌతాయి (రాజా రామ మోహన రాయల వంటి వారు మొదట సమాజం ఆక్షేపణ కు గురైనవారే). కానీ వీరి విలువలు సమాజ, న్యాయ విలువల కన్నా ఉన్నతమైనవి. వారికి తమ మానవ విలువల లో ఉన్న నమ్మకం కూడా అచంచలమైనది.క్రమం గా సమాజమూ, న్యాయమూ తమ తప్పు తెలుసుకొని సంస్కర్తల విలువలను అంగీకరిస్తాయి. తరువాత వీరి విలువలే సమాజ, న్యాయ విలువలు గా మారుతాయి. కాలం చలన శీలమైనది. కాలచక్ర గమనం తో పాటు ఈ సంస్కర్తలు తెచ్చిన విలువలు కూడా బూజుపట్టి ప్రగతి నిరోధకాలై, మళ్ళీ కొత్త విలువలకు వేదిక తయారు చేస్తాయి. ఈ చక్ర భ్రమణం అనంతం.

ఒక్కోసారి మన వ్యక్తి గత విలువలు సమాజ విలువలకి విరుధ్ధం గా ఉండవచ్చు. అప్పుడు మనం సమాజ విలువలను అంగీకరించం. ఆ విలువలను ప్రశ్నిస్తాం. అలా అని మన వ్యక్తిగత విలువలు సమాజ విలువల కంటే ఉన్నతమైనవని చెప్పలేం.  ఈ సందర్భం లో సమాజ విలువలకి వ్యతిరేకం గా ఆలోచించటానికి  మనం గిల్టీ గా ఫీల్ కాము.  చలం తన పెద నాన్న కూతురిని పెళ్ళి చేసుకోవటానికి శృంగేరి పీఠాధిపతి అనుమతి కోరటం ఈ కోవలోకే వస్తుంది. 
మన వ్యక్తి గత విలువలు న్యాయస్థానాల విలువల తో విబేధించినా, మన విలువలు న్యాయస్థానాల విలువల కనా ఉన్నతమైనవి అయినా కూడా చివరికి మనం న్యాయస్థానాల విలువలనే అంగీకరించాలి. లేకపోతే న్యాయస్థానం మనలని శిక్షిస్తుంది. న్యాయస్థానాలు నిరంకుశమైనవి మరి. మనకి “లా” ఏమి చెబుతోందో తెలియక పోయినా, దానిని ఉల్లంఘించినట్లైతే అది మనని శిక్షిస్తుంది. చూడండి న్యాయస్థానాల అన్యాయం!ఈ మాట పై కి అంటే, మళ్ళీ మనని  contempt of court కింద శిక్షిస్తాయి :-( . ఎంచక్కా మన పెజాస్వామ్యం లో రాజకీయ నాయకులనైతే నోరారా తిట్టుకోవచ్చు. అప్పుడప్పుడూ చెంపదెబ్బలు కూడా కొట్టుకోవచ్చు :-) . (మనం వోట్ వేయం. వేసేవాళ్ళు డబ్బు తీసుకొని వేస్తారు. చివరికి తిట్టటానికి మాత్రం రా.నా. లను తిట్టుకోవచ్చు..ఎంచక్కా..)

  కానీ, ప్రతి వాడూ తన సొంత విలువలను ప్రతిపాదిస్తే ఇక న్యాయస్థానాల మాట వినేవాడెవడు? అందుకే న్యాయస్థానాలు నిరంకుశం గా ఉండక తప్పదనుకొంటా! అలానే, న్యాయస్థానాలు “లా” తెలియని వారిని క్షమించేటట్లైతే, నేరస్తులు “లా” తెలిసినా, అది ఏం చెబుతోందో తనకు తెలియదని శిక్ష తప్పించుకొంటారు కదా! అప్పుడు న్యాయవాదులతో పనే ఉండదు.”లా” తెలుసుకోని వారికి శిక్ష నుంచీ exemption ఇస్తే, అందరూ “లా” ని తెలుసుకోకుండా ఉండేందుకు పోటీ పడతారనుకొంటా! :-(

న్యాయ స్థానాల తీర్పులను ఫిర్యాదీలు విమర్శించటం మొదలు పెడితే వాటి తీర్పులను ఎవరూ నమ్మరు. తరువాత వాటి దగ్గరికి న్యాయం కోసం ఎవరూ వెళ్ళరు. న్యాయస్థానాన్ని విమర్శించటం అంటే, న్యాయస్థానం చెప్పే తీర్పుని అంగీకరించకపోవటం. అటువంటి వారు న్యాయం దొరుకుతుందన్న నమ్మకం తో మొదట న్యాయస్థానాన్ని ఎందుకు ఆశ్రయించారన్న ప్రశ్న వస్తుంది. తనకు అనుకూలం గా తీర్పు వస్తేనే తీర్పును అంగీకరిస్తాననటం సరి కాదు. తీర్పు తమకు అనుకూలం గా వచ్చినపుడు కూడా ఆ తీర్పును విమర్శించేవారు ఉండరు కదా? కాబట్టీ న్యాయస్థానాన్ని విమర్శించటానికి ముఖ్య కారణం తీర్పు వలన తమకు వచ్చిన నష్టం అయి ఉంటుంది. న్యాయస్థానం యొక్క పక్షపాతం అయ్యే అవకాశం తక్కువ. న్యాయస్థానాలు అన్నివేళల్లోనూ నిష్పాక్షికం గా వ్యవహరించవనుకోండి. వాటికి ఉండే biases, ప్రలోభాలు వాటికి ఉంటాయి.  అది వేరే విషయం.అప్పుడు పై న్యాయస్థానాలకు అప్పీలు చేసుకొంటూ సుప్రీం కోర్ట్ దాకా వెళ్ళవచ్చు. కానీ సుప్రీం కోర్ట్ మీద ఎవరికి అప్పీలు చేయాలి?  
క్రిమినల్ కేసుల్లో కేసు ఓడిపోయిన వ్యక్తి యొక్క న్యాయవాది అబధ్ధాలు చెప్పినట్లు కదా!(ఇదే లాజిక్ ప్రకారం  ఎగువ కోర్ట్ లో వేరే గా తీర్పు వస్తే దిగువ కోర్ట్ జడ్జ్ గారు అబధ్ధం ఆడినట్లా? ) మరి ఆ న్యాయవాదిని ఎందుకు న్యాయస్థానం శిక్షించదు? అబధ్ధాలు చెప్పటం అతని “వృత్తి” కాబట్టీ నా? లేక అతను చెప్పిన అబధ్ధాల వల్లే సత్యం వెలుగులోకి వచ్చిందనా? ఒక న్యాయవాదిని జైల్లో  పెడితే, తరువాత ఎవరూ కేసులు వాదించరనా?  

ఇప్పుడు ఊరి నిండా న్యాయవాదులు ఉన్నా వారికి ఫీజు చెల్లించలేని మామూలు జనానికి వారి వలన ఏమి లాభం. కాబట్టీ పరిస్థితి ఇప్పుడు కూడా న్యాయవాదులు లేనట్లు గానే ఉండి. న్యాయ వ్యవస్థ ఖరీదైనదవ్వటం వలన మెజారిటీ జనాలకు అది అందుబాటులో లేదు. అంటే జనసామాన్యానికి అది ఉన్నా లేనట్లే. అది వారి కోసం రూల్స్ పెట్టటం మినహా, వారికి అవసరమైనపుడు అందుబాటు లో ఉండదు.  దాని వలన వారికి మేలు జరుగదు.  డబ్బు ఖర్చు పెట్టగల వారికి మన నత్త నడక న్యాయ వ్యవస్థ చుట్టూ తిరిగే సమయమూ, ఓపికా ఉండవు.

న్యాయస్థానాలు పిచ్చి వారూ, మానసిక వ్యాధి గ్రస్తులూ చేసిన నేరాలకు వారిని ఎందుకు శిక్షించవు? వారి నేరాల వలన కూడా ఇతరులు ఇబ్బంది పడతారు కదా? న్యాయ స్థానాలు ముందు “నేరం చేసే ఉద్దేశాన్ని(మోటివ్) చూస్తాయి. ఆ ఉద్దేశం ఉన్న వారిని శిక్షించటం ద్వారా ఇక ముందు వారి నేరం చేయాలనే కోరిక ను తగ్గిస్తాయి. అప్పుడప్పుడూ మనిషి నేర ఇఛ్ఛ కు కారణాలూ పరిస్థితులను పరిగణన లోకి తీసుకొంటాయి . కానీ ఈ కారణాలూ పరిస్థితులూన్యాయస్థానాల పరిధిలోనివి కాదు.న్యాయ స్థానాలు ఆ పరిస్థితులను మార్చలేవు. వాటిని గురించిన కొన్ని పరిశీలనలను తమ తీర్పులో పొందుపరచటం మినహా ఏమీ చేయలేవు.  మొత్తానికి మనిషి నేర ఇఛ్ఛకి పరిస్థితులు కారణం అయినా, లేక దేవుడు ప్రసాదించిన స్వేఛ్ఛా సంకల్పం( ఫ్రీ విల్) కారణం అయినా, లేక పరోక్షం గా దేవుడే కారణం అయినా న్యాయస్థానాలు  నేరం చేసే ఉద్దేశం నిరూపించబడినపుడు అసలే శిక్ష వేయకుండా ఉండవు. ఇది మామూలు వ్యక్తుల విషయం.
ఇక పిచ్చివాళ్ళ, మానసిక వ్యాధి గ్రస్తుల విషయానికి వస్తే,..వారి ఉద్దేశాలకీ, వారి వ్యక్తిత్వానికీ మధ్య సంబంధం అసాధారణం గా, అస్పష్టం గా ఉంటుంది.  ఉదాహరణకి obsessive compulsive disorder ఉన్నవాళ్ళు సరిగ్గా తమ కోరిక కి విరుధ్ధం గా ప్రవర్తిస్తారు. వారికి అలా ప్రవర్తించే విషయం లో స్వేఛ్ఛ ఏమాత్రం ఉండదు. They are compelled to behave in that way. . అలానే schizophrenia ఉన్న వారు violent గా ప్రవర్తించే అవకాశం ఉంది. అలా ప్రవర్తించకుండా నిగ్రహించుకొనే సంకల్పం వారి మెదడులోకానీ, శరీరం లో కానీ ఉండదు. కాబట్టీ వారి ప్రవర్తనకు నేరం వారి రోగానిది. కుంటి వారి వైకల్యం పైకి కనపడుతుంది. కానీ వీరి వైకల్యం పైకి కనపడదు.కోర్ట్లు , అలాంటి వారిని శిక్షించటం ద్వారా, వారు తరువాత నేరాలను చేయటాన్ని తగ్గించటం కుదరదు.వ్యాధి ఉన్నంత వరకూ వారు నేరాలు చేయటానికే అవకాశం ఉంటుంది.  అందుకే వారిని ఏ శరణాలయాలలోనో చేర్చమని న్యాయస్థానాలు సలహా ఇస్తాయి.

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ- 37

బస్సు వెంకటాపురం వెళ్తోంది. శ్రీధర్ బస్సులో తను మామూలు గా కూర్చొనే కిటికీ సీట్లో కూర్చొన్నాడు. అతని మనసు ఎక్కడో ఉంది. శూన్యం లోకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. దారి లో వచ్చే చెరుకు తోటలూ, తమలపాకు తోటలూ  ఆహ్లాద పరచలేక పోతున్నాయి. పైగా వాటిని చూస్తూంటే  అతనికేదో దిగులు కలుగుతోంది.
వాళ్ళ ఇంటి ముందు కొట్టేసిన రావి చెట్టు మొదలు చుట్టూ పిలకలు వస్తున్నాయి. ……………………………………………………………………………………………

……………………………………………………………………………………………

……………………………………………………………………………………………

……………………………………………………………………………………………

……………………………………………………………………………………………

……………………………………………………………………………………………

……………………………………………………………………………………………

…………………………………………………………………………………………..

……………………………………………………………………………………………

…………………………………………………………………………………………….

…………………………………………………………………………………………….

……………………………………………………………………………………………..

………………………………………………………………………………………………

……………………………………………………………………………………………..

 

……………………………………………………………………………………………..

 

……………………………………………………………………………………………..

 

……………………………………………………………………………………………..

 

……………………………………………………………………………………………..

 

……………………………………………………………………………………………..

 

……………………………………………………………………………………………..

 

……………………………………………………………………………………………..

 

……………………………………………………………………………………………..

 

 

…………………………………………………………………………………………….. 

……………………………………………………………………………………………..

 

……………………………………………………………………………………………..

 

……………………………………………………………………………………………..

అయిపోయింది

మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456

అయిపోయింది

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-36

శ్రీధర్ తన ఉద్యోగం గురించి తృప్తి గా లేడు. చాలా చాలా ఇంటర్వ్యూలు ల కి వెళ్ళిన తరవాత అతనికి ఒక జాబ్ ఆఫర్ వచ్చింది. జాబ్ మారదామనుకొంటుండగా అతని కి వాళ్ళ అమ్మ దగ్గరి నుంచీ ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆమె కృష్ణా రావు కి ఆరోగ్యం బాగా లేదని చెప్పింది. అతనికి వెన్ను నొప్పి వచ్చింది.
శ్రీధర్ అన్నాడు,”అమ్మా, నువ్వూ నాన్నా బెంగుళూరు వచ్చేయండి. నేను ఇక్కడ నాన్న గురించి జాగ్రత్త తీసుకొంటాను”.
“మేము అక్కడ ఒక వారం కంటే ఎక్కువ రోజులు ఉండలేము  రా. కాలక్షేపం అవ్వదు మాకు. పైగా సరళ కి అనవసరమైన పని మా వలన”, అంది చంద్రమ్మ.
శ్రీధర్ వాళ్ళ ఊరెళ్ళి వాళ్ళ నాన్న కు వైద్యం చేయిద్దాం అనుకొన్నాడు. ఆఫీస్ లో ఆనంద్ ని లీవ్ అడిగాడు.
“ఇప్పుడు ప్రాజెక్ట్ చాలా కీలకమైన దశ లో ఉంది. ప్రాజెక్ట్  లో నీది ముఖ్యమైన పాత్ర అని నీకు తెలుసు. నీ లీవ్ ని వాయిదా వేసుకో”, అన్నాడు ఆనంద్ ఎప్పటిలానే.
“అనివార్య కారణాల వలన నేను నా సెలవు ని వాయిదా వేయలేక పోతున్నాను. అయినా నీకు మనీషా ఎప్పుడూ దన్ను గా ఉంటుంది కదా?”, అన్నాడు శ్రీధర్ వ్యంగ్యం గా.
సీట్ దగ్గరికొచ్చి, వ్యక్తిగతమైన కారణాలను చూపుతూ, ఆనంద్ కి రెజిగ్నేషన్ మెయిల్ పంపించాడు శ్రీధర్. శ్రీధర్ కి ఆనంద్ మీద ఉన్న కసి అంతా ఆ క్షణం లో తీరి పోయింది.
వాళ్ళ ఊరికి బయలు దేరాడు శ్రీధర్. వాళ్ళ నాన్న కి తగ్గిన తరవాత బెంగుళూరు వచ్చి కొత్త జాబ్ లో జాయిన్ అవుదామనుకొన్నాడు. వెళ్ళే ముందు సరళ వస్తుందేమో అడిగాడు.
దానికి సరళ,”నేను ఎప్పుడూ పల్లెటూరు వెళ్ళలేదు. పైపుల్లో నీళ్ళూ, అటాచ్ బాత్రూం లేని చోట కి నేను రాలేను”, అంది. వాళ్ళిద్దరి మధ్యా మొహమాటాలు చాలా త్వరగా తగ్గిపోతున్నాయి.
***********
కృష్ణా రావు వెన్ను నొప్పిని మందుల తో తగ్గించవచ్చని బందరు లో డాక్టర్ చెప్పాడు. ఓ వారం ఊళ్ళోనే ఉండి, వాళ్ళ నాన్న ని చూసుకొన్నాడు శ్రీధర్.   కృష్ణా రావు కి కొంచెం మెరుగయ్యింది.
అక్షయ్ కోసం ఫోన్ చేశాడు శ్రీధర్ సరళ కి. అప్పుడు చెప్పింది సరళ. శ్రీధర్ చేరబోయే కంపెనీ నుంచీ ఈ మెయిల్ వచ్చిందట. శ్రీధర్ కి ఇచ్చిన ఆఫర్ ఓ ఆరు నెలలు ఆలస్యం చేశారంట. రిసెషన్ రోజులలో వాయిదా అంటే “జాబ్ ఇవ్వక పోవటానికి” ముద్దు పేరు. ఓ రోజల్లా ఏమీ తోచలేదు శ్రీధర్ కి. ఆనంద్ మీద రాయి విసిరి పారిపోదామను కొన్నాడు శ్రీధర్. రాయి విసరటమైతే విసిరాడు. కానీ పారిపోయేటప్పుడే గోతి లో పడ్డాడు, అదీతానే తవ్వుకొన్న దాంట్లో.  ఆనంద్ తెరిచి ఉంచిన తలుపుని తానే మూసేసి వచ్చాడు.
తనకు జాబ్ పోయిన సంగతి శ్రీధర్ తన అమ్మా నాన్న లకి చెప్పలేదు. బెంగుళూరు ఆఘ మేఘాల మీద వచ్చేశాడు, వేరే జాబ్ వెతుక్కోవటానికి. ఇంటికెళ్ళగానే సరళ అడిగింది, “మీ నాన్న కి ఎలా ఉంది?”
” మా నాన్న కి ఎలా ఉంటే నీకేంటి? అంతగా ఆయన గురించి శ్రధ్ధ ఉంటే నాతో పాటు వచ్చి అయన గురించి జాగ్రత్త తీసుకోవాల్సింది”, అన్నాడు.
“అప్పుడు నేను కూడా నీ లాగే జాబ్ లేక ఈగలు తోలుకోవాల్సి వచ్చేది”, అందామె అగ్ని కి ఆజ్యం పోస్తూ.
ఆ ఆదివారం సరళ షాపింగ్ కి వెళ్ళాలనుకొంది. ఆమె కి తెలుసు శ్రీధర్ కి షాపింగ్ అంటే ఇష్టం లేదని. అందుకే తోడు రమ్మని అడగలేదు. ఇంట్లో ఉండి అక్షయ్ ని చూసుకోమని చెప్పిందామె శ్రీధర్ కి.  శ్రీధర్ ఆమె ని అడిగాడు, “ఏమి కొనబోతున్నావ్?”
” ఇదీ అని ఏమీ లేదు. వెళ్ళి చూస్తాను. ఏదైనా ఇంటరెస్టింగ్ గా ఉంటే కొంటాను”
శ్రీధర్ అన్నాదు,”ముందు ఏమి కొనాలో కూడా తెలియకుండా, కొనటానికి వెళ్ళటం చాలా విచిత్రం గా ఉంది నాకు”
“శ్రీధర్, కొందామన్నా నీ దగ్గర డబ్బు లేదు. వేరే వాళ్ళని కూడా ఎందుకు అడ్డుకొంటావ్?”,అని విసురు గా వెళ్ళిపోయిందామె, అప్పటికే రెడీ గా ఉన్న ఆటో ఎక్కి.
శ్రీధర్ కి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. కానీ వాడి మనసు తిట్టింది, “మగాడివై ఏడవటానికి సిగ్గులేదూ?”. అతని మగ జన్మకి ఏడ్చే స్వేచ్చ లేదు.
ఇంతలోఫోన్ మోగింది…వాళ్ళ అమ్మ..”ఈ సంవత్సరం పంటలు బాగా పండలేదు. దానితో మన చేను మగతా కి తీసుకొన్న రంగా రావు మామయ్య డబ్బులు కూడా సరిగా ఇవ్వలేదు. మీ నాన్న మందుల ఖర్చులేమో పెరుగుతున్నాయి. మీ నాన్న గురించి నీకు తెలుసు. ఆయనకి అత్మాభిమానం ఎక్కువ. ఆయకి తెలియనివ్వకుండా …కొంచెం డబ్బు పంపిస్తే అవసరానికి ఉపయోగ పడుతుంది”
షాపింగ్ నుంచీ తిరిగి వచ్చిన తరవాత సరళ ని అడిగాడు,”ఓ ఇరవై వేలుంటే అప్పిస్తావా?”
“శ్రీధర్, ఇప్పుడు హౌస్ లోనూ “ఈ ఎం ఐ” కూడా నేనే కడుతున్నాను.ఇది నీకు తెలుసు. అద్దె నేనే కడుతున్నాను. నా దగ్గరా డబ్బు చాలా తక్కువే ఉంది. అక్షయ్ కోసం కొంత డబ్బు దాచి ఉంచాను. మనకు ఏమైనా అనుకోని ఖర్చులు వస్తే ఉంటాయని.” అని,” అయినా నీకు ఇప్పుడు ఇరవై వేలు ఎందుకు?” అందామె. శ్రీధర్ చెప్పాడు.
“నాల్రోజుల కిందట నువ్వే అన్నావు. నాకు మీ అమ్మా నాన్నలంటే పట్టదని.అవును కరెక్టే నేనెందుకు పట్టించుకోవాలి?”

మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456

ఇంకా ఉంది…

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-35

శ్రీధర్ కి వాళ్ళ మామ గారి నుండీ ఫోన్ వచ్చింది. “సరళ కి లేబర్ పెయిన్స్ వచ్చాయి. ఆమె ను హాస్పిటల్లో జాయిన్ చేశాం.”
శ్రీధర్ లో ఆదుర్దా పెరిగింది. చెన్నై కి టికెట్లు బుక్ చేదామని బయలు దేరాడు. ఈ లోగా ఇంకో కాల్.  మళ్ళీ మామ గారే,” కంగ్రాట్యులేషన్స్. సరళ మగ పిల్లాడిని ప్రసవించింది. నార్మల్ డెలివరీ నే. తల్లీ పిల్లాడూ ఇద్దరూ ఆరోగ్యం గా ఉన్నారు”.
శ్రీధర్ కి ఒక సహజమైన అవసరం తీరిన ఆనందం కలిగింది. రోజు వారి జీవితం లో లేనటువంటి ఒక గర్వం కలిగింది అతనికి. అతని ఆనందానికి ఏవో భౌతికమైన కారణాలు ఉండి ఉండాలి.
*************
ఇంకో ఆర్నెల్లకి సరళ కి బెంగుళూరు లో ఉద్యోగం వచ్చింది. బాబు తో సహా ఆమె బెంగళూరు కు వచ్చేసింది. చెన్నై లో ఉన్న వాళ్ళ ఇంటిని అద్దెకి ఇచ్చారు. వాళ్ళ తమిళ నాడు కారు ని నియమాల ప్రకారం చెల్లించవలసిన లంచాలు చెల్లించి బెంగళూరు కు తీసుకొని వచ్చారు. వాళ్ళ అపార్ట్ మెంట్ సరళ ఆఫీస్ కి దగ్గర గా ఉండేటట్లు తీసుకొన్నారు. దీని వలన శ్రీధర్ వాళ్ళ ఆఫీస్ ఇంటి నుంచీ బాగా దూరమైపోయింది. శ్రీధర్ పొద్దున్నే బయలుదేరేటప్పటికి బాబు లేవను కూడా లేవడు.  మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి కనీసం రాత్రి తొమ్మిది అవుతుంది. అప్పటికి బాబు నిద్ర పోతూ ఉంటాడు. ఇక వాడి తో ఆడు కోవటం వీకెండ్స్ లో నే. అప్పుడు కూడా వీక్ డేస్ లో చాలని నిద్ర, దాడి చేయకుండా ఉంటే. పగలు సరళ ఆఫీస్ కు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆఫీస్ కి దగ్గర లో ఉన్న ‘క్రెష్’ లో బాబు ని వదిలి పెట్టి వెళ్తుంది.  సాయంత్రం ఆఫీస్ నుంచీ వచ్చేటప్పుడు మళ్ళీ వాడిని తీసుకొచ్చుకొంటుంది.
వాళ్ళ అపార్ట్ మెంట్  సముదాయం పేరు “గ్రీన్ వాలీ.”  అది చూడటానికి శుభ్రం గా లాండ్ స్కేపింగ్ తొ సహా నీటు గా ఉంటుంది. మొదట ఆ బిల్డర్ అక్కడ ఉన్న పచ్చని తోటలనూ, పొదలనూ వాటి మీద ఆధారపడి ఉండే జీవావరణాన్నీ ప్రొక్లైనర్ల తో తొలగింఛాడు. తరవాత అక్కడ ఒక కాంక్రీట్ వనాన్ని కట్టాడు.  ఆ కాంక్రీట్ అడవి లో పేలికలలాగా చిన్న ప్రదేశాన్ని లాండ్ స్కేపింగ్ చేసి దానికి “గ్రీన్ వాలీ” అని పేరు పెట్టాడు. ఆ పైన వాటిని మతి పోయే లాభానికి మతి తప్పిన కోడ్ కూలీ లకి అమ్మాడు. బాంకుల దగ్గర అప్పులు తీసుకొని వాటిని కొన్న కోడ్ కూలీలు రిసెషన్ దెబ్బకి “ఈ ఎం ఐ ” లు కట్టగలమా అనే సందేహం లోపడ్డారు.
శ్రీధర్ వాళ్ళ కుటుంబంలో ఒక సాంప్రదాయం ఉంది. బిడ్డ పుట్టిన తరువాత బిడ్డ నాన్న ఊరిలో వాడికి అన్నప్రాసన చేయాలి. కానీ శ్రీధరూ సరళలకి సెలవలు దొరకలేదు. బాస్ కి ఇష్టం లేకుండా సెలవు పెట్టి వెళ్తే ఎక్కడ ఉద్యోగాలకు ఎసరు పెడతాడో అని భయం. చంద్రమ్మ ఫోన్ లో శ్రీధర్ తో అంది, “మన కుటుబం లో ఈ ఆచారాన్ని పాటించక పోవటం ఇదే మొదటి సారి. నీ చిన్నప్పుడు మీ నాన్న ఊరంతటినీ భోజనాలకి పిలిచారు. మీరు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసీ లాభంలేకుండా పోయింది.”
****************
బాబు కి అక్షయ్ అని పేరు పెట్టారు. వాడి మొదటి పుట్టిన రోజు ఘనం గా చేశాడు శ్రీధర్. బాబు తన చిన్న చేతులని ఊపినప్పుడల్లా శ్రీధర్ ఎదంతా ఏదో తెలియని గర్వం తో నిండిపోయేది. చంద్రమ్మా కృష్ణా రావూ రాలేదు.వాళ్ళకి కోపం వచ్చింది వాడి అన్నప్రాసన ఊళ్ళో చెయ్యలేదని. పైగా కృష్ణా రావు అననే అన్నాడు, “అన్నప్రాసన కి టైం లేదు కానీ, అదేదీ…ఆ.. బర్త డే కి టైం దొరికింది వీడికి” అని. ఫంక్షన్ లో ఎవరో అడిగారు సరళ ని మీ అత్తా మామలేరని, “వాళ్ళు రాలేదు” అందామె.మళ్ళీ ఆ అడిగిన వాళ్ళే అన్నారు,”ఎందుకు రాలేదు?”.
“ఏమో తెలియదు”, అని లోల్లోపల ఆ అడిగిన వాళ్ళ మీద చాలా గింజుకొంది సరళ.
అక్షయ్ చురుకు గానే ఉంటున్నాడు కానీ, శ్రీధర్ కి ఒక విషయం దిగులు గా ఉంది. వాడు ఇంకా చిన్న చిన్న మాటలు కూడా చెప్పటంలేదు. వాడిని పేడియాట్రిషియన్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు శ్రీధర్.
డాక్టర్ “బాబు రోజూ చేసే పనుల” గురించి అడిగాడు. శ్రీధర్ వాళ్ళమ్మ క్రెష్ ళొ ఒదిలిపెడుతుందని చెప్పాడు.
డాక్టర్ అన్నాడు, క్రెష్ లో ఏమి చేస్తారు?”
శ్రీధర్ కి తెలియదు. తరువాతి సోమ వారం సెలవు పెట్టి శ్రీధర్ క్రెష్ కు వెళ్ళాడు, బాబు ఏమి చేస్తున్నాడో చూడటానికి. క్రెష్ గేట్ తలుపులు తాళం వేసి ఉన్నాయి. ఒక  పదిహేడేళ్ళ కుర్రాడు గేట్ తీశాడు. లోపల పిల్లలు బొమ్మలతో ఆడుతున్నారు. ఒక మధ్య వయసు ఉన్న ఆమె వచ్చి పిల్లలు బయటికి వెళ్ళకుండా గేట్ తాళం పెట్టాము అని చెప్పింది.  గేట్ బయట వాహనాలన్నీ పొగలు కక్కుకొంటూ వెళ్తున్నాయి.
కొంతమంది పిల్లలు టీవీ లో కార్టూన్ మూవీ చూస్తున్నారు.
“అక్షయ్ క్రెష్ లో ఎలా ఉంటాడు?”,అని అడిగాడు శ్రీధర్ ఆ మధ్య వయసామెని.
“బాగానే ఉంటాడు సార్.ఒక్కొక్క సారి వాళ్ళ అమ్మ గురించి ఏడుస్తాడు. లేకపోతే పరవాలేదు”
అక్షయ్ ని తీసుకొని ఇంటికి వచ్చేశాడు శ్రీధర్. అపార్ట్మెంట్లో అందరూ వాళ్ళ ఆఫీస్ లకి వెళ్ళిపోయారు.నిర్మానుష్యం గా ఉంది. సాయంత్రమే మళ్ళీ వాళ్ళు ఇంటికి వచ్చేది. మిగతా సమయమంతా మరుసటి రోజు కి తయారవ్వటం లోనే సరిపోతుంది వాళ్ళకి. వీకేండ్స్ వచ్చాయంటే,వీక్ డేస్ లో పడిన శ్రమ నుంచీ ఒత్తిడి నుంచీ రిలాక్స్ అవ్వటానికే సరిపోతుంది. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటానికి కూడా తీరిక ఉండదు.
శ్రీధర్ ఇంట్లోకి వెళ్ళి టీవీ ఆన్ చేశాడు. ఒక వార్తా చానల్లో నగరంలో కిడ్నాప్ అయ్యిన ఒక చిన్నమ్మాయి గురించి చూపిస్తున్నాడు. ఇంకోచానల్ లో వివిధ నగరాల లో ని పొల్యూషన్ లెవల్స్ గురించి చెప్తున్నాడు. అతనికి మొదటి సారిగా తన కొడుకు భవిష్యత్తు గురించి భయం వేసింది. వాడి రా బోయే రోజులు ఆనందం గా ఉండవేమో అనిపించింది శ్రీధర్ కి. శ్రీధర్ కి తన బాల్యం గుర్తుకు రాసాగింది. ” తన నాయనమ్మ చెప్పిన కధలూ..ఆ కధలు చెప్తూ ఆమె పాడిన పద్యాలూ…ఊళ్ళో ఏ భయమూ లేకుండా గాలికి తిరిన రోజులూ…చెరువు లో పట్టిన చేపలూ…వాటిని మళ్ళీ వదిలేసిన గుంటలూ…అప్పటి అమాయకత్వం…కాలువల్లో ఈతలూ…మామిడి తోటల్లో ఆటలూ…అభం శుభం తెలిసీ తెలియని వయసూ..”
శ్రీధర్ వాళ్ళ అమ్మా నాన్నా ఎప్పుడూ దిగులు పడలేదు ఊళ్ళొ వాడు క్షేమం గా ఉంటాడో లేదోనని. ముందు గా మనిషి ప్రకృతి లో భాగం గా ఉండి ఉంటాడు. తరువాత సమాజం ఏర్పడి,సమాజం వాడికి నీతి నియమాలని నేర్పి ఉంటుంది. దీని వలన మనిషి ప్రకృతి నుంచీ కొంత దూరం గా జరిగి సమాజనికి కొంత దగ్గరయ్యి ఉంటాడు.  ఇప్పుడు ఈ ఆధునికత వచ్చి వ్యక్తిని సమాజం నుంచీ వేరు చేస్తున్నట్లుంది. ఈ ప్రక్రియ పాశ్చాత్య సమాజం లో ఇప్పటికే జరుగుతోంది. అక్కడ ప్రతి ఒక్కరూ సముద్రం లోఉన్న ఒక ద్వీపం లాంటి వారే.”
సరళా శ్రీధరూ బాగానే సంపాదిస్తున్నారు. కానీ శ్రీధర్ చిన్నప్పుడు అనుభవించిన బాల్యం ఇప్పుడు అతని కొడుకుకి ఇవ్వటానికి ఎంత ఖర్చవుతుంది? అతని కొడుకు బాల్యం చాలా చప్ప గా ఉండేటట్లుంది. ఇంట్లో వాడికి తోడు గా ఇంకొక చిన్న పిల్లాడో, పిల్లో ఉంటె వాడు కొంచెం సంతోషం గా పెరుగుతాడేమో.
ఆ రోజు రాత్రి శ్రీధర్ సరళ ని అడిగాడు,”మనం ఇంకొక బిడ్డ ని కందామా?” అని.
ఆమె అంది, “ఇక్కడికి వీణ్ణి పెంచటానికే మనం కష్ట పడ వలసి వస్తోంది. ఇంకొకరి ని ఎలా పెంచ గలం. ఒక్కడైతే మనకొచ్చేడబ్బులతో వీడికి ఏమీ కొదవ లేకుండా పెంచ వచ్చు. ఇద్దరిని మనం భరించ గలమా? ఐనా నేను ఇంకో కానుపుకి సిధ్ధం గా లేను. పిల్లల్ని కనటం అనేది చాలా ఒత్తిడి తో కూడుకొన్న పని. మీ మగాళ్ళకు ఈ విషయం చెప్పినా అర్ధం కాదు”
శ్రీధర్ అనుకొన్నాడు,”ఆశ్చర్యం గా ఉందే! మామ్మా నాన్నా సన్నకారు రైతులై ఉండీ మమ్ముల్ని ఇద్దర్ని సంతోషం గా పెంచారు. కానీ అధికాదాయం వచ్చే ఉద్యోగాలు చేస్తూ మేమిద్దరం ఇంకొకరిని పెంచలేక పోతున్నామే?”

మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456

ఇంకా ఉంది…

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-34

శ్రీధర్ కీ, సరళ కీ గూడా కావలసిన విశ్రాంతి దొరికింది. వాళ్ళు దగ్గర లో ఉన్న పార్కులు అన్నీ చుట్టి వచ్చారు. డాక్టరు సలహా తీసుకొని ఆ తరువాత బెంగళూరు చుట్టు పక్కల ఉండే ప్రదేశాలు చూశారు. ఓ నాలుగు రోజులు కూర్గు వెళ్ళివచ్చారు.
శ్రీధర్ లీవ్ అయ్యేరోజు సరళ తన పీరియడ్స్ మిస్ అయ్యాయని చెప్పింది. టెస్ట్ చేయించుకొంటే ఆమె ప్రెగ్నెంట్ అని కన్ ఫం అయ్యింది.
శ్రీధర్ ఆఫీస్ కి వెళ్ళాడు. అతని మెయిల్ ఇన్ బాక్స్ అంతా నిండిపోయింది. ప్రాజెక్ట్ అయిపోవస్తూంది.  మనీషా ప్రాజెక్ట్ ని బాగానే మానేజ్ చేసినట్లుంది. కస్టమర్ లూసీ నుంచీ మనీషా కి పొగుడుతూ వచ్చిన కొన్ని మెయిల్స్ చూశాడు శ్రీధర్. ఆనంద్ కూడా మనీషా గురించి హాపీ గానే ఉన్నాడు. శ్రీధర్ కి స్పెసిఫికేషన్స్ గురించి మంచి అవగాహన ఉండటం తో ఆనంద్ శ్రీధర్ ని ఫంక్షనల్ టెస్టింగ్ చూడమన్నాడు. శ్రీధర్ కూడా రిలాక్స్ అయ్యాడు తనని ప్రాజెక్ట్ లో నుంచీ తీసివెయ్యనందుకు. అతనికి స్ట్రోక్ వచ్చే ముందు సరళ మాట్లాడినప్పుడు, ఆనంద్ శ్రీధర్ ని టెక్నికల్ లీడ్ చేద్దామనుకొన్నాడు. శ్రీధర్ అనవసరం గా గాభరా పడ్డాడు.
సరళ మూడో నెలలో మద్రాస్ వాళ్ళ అమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళీంది. శ్రీధర్ ది మళ్ళీ ఒంటరి బతుకైంది.
శ్రీధర్ అప్రైజల్స్ స్టార్ట్ అయ్యాయి. ఆనంద్ అతనికి ఐదింటికి గాను రెండు రేటింగ్ ఇచ్చాడు. శ్రీధర్ కి ఇదేమీ నచ్చలా. “నాకు స్ట్రోక్ రావటం నా తప్పు కాదు. లేక పోతే నేను బాగా పని చేసేవాడిని” అని వాదించాడు.
ఆనంద్ అన్నాడు,”శ్రీధర్ నేను ప్రాజెక్ట్ కి నీ వంతు చేసిన పనిని మాత్రమే చూస్తాను. నీ వంతు తగ్గటానికి నీ అనారోగ్యం కారణం కావచ్చు. కానీ అది నేను పట్టించుకోను”,అన్నాడు. ఇంకా,”ముందు గా ప్రాజెక్ట్ గురించి కస్టమర్ హాపీ గా లేడు. మనీషా వచ్చిన తరవాత పరిస్థితి మెరుగయ్యింది.” అన్నాడు.
“ఏది ఏమైనా, నువ్వు ఒక మంచి టెక్నికల్ రిసోర్స్ వి అని నేను అనుకొంటున్నాను. మనం తరవాతి ప్రాజెక్ట్ లలో కూడా కలిసి పనిచేద్దాం. ఆల్ ద బెస్ట్!” అన్నాడు ఆనంద్.
శ్రీధర్ కి ఆనంద్ మాటలు రుచించలా.
*************
ఆర్ధిక మాంద్యం మొదలైంది. అమెరికా లో పేరాశ తో హెడ్జ్ ఫండ్స్ మొదలెట్టాయి ఈ పతనాన్ని. బాగా చదువుకున్న మా రాజులు ఒక సృజనాత్మకమైన సంక్షోభాన్ని సృష్టించారు. లీ మాన్ బ్రదర్స్ ని మూసేశారు. ఐటీ కుదేలైంది.  లే ఆఫ్ లు మొదలయ్యాయి. చాలా కంపెనీలు వర్కింగ్ అవర్స్ ని తొమ్మిది గంటలకి పెంచాయి. మే డే రోజు అమెరికా  లో కార్మికులు ఎప్పుడో ఎనిమిది గంటల పని సమయం సాధించుకొన్నారు అని చిన్నప్పుడు చదివాడు శ్రీధర్. అది కరెక్ట్ కాదా అని అనుమానమొచ్చింది శ్రీధర్ కి. మానేజర్లు ఉద్యోగులకి వీకెండ్స్ లో పని చెయ్యండి అని మెయిల్స్ పంపిస్తున్నారు. కస్టరమర్స్, ప్రపోజల్ లొ అంగీకరించిన దానికంటే రెండు మూడు రెట్లు ఎక్కువ పని చేయించుకొంటున్నారు. పరిమితమైన డబ్బులకి అపరిమితమైన పని చేయటం అనేది ఫ్యూడల్ సమాజం లో ఉంటుందని శ్రీధర్ చదివాడు చిన్నప్పుడు. ఇప్పుడు ఈ కస్టమర్లు నయా భూస్వాములులా అనిపిస్తున్నారు. దీని వలన ఉద్యోగులు రెండు మూడు రెట్లు పని చేయవలసి వస్తోంది. జీతాలేమో తగ్గించారు. ఏం చేద్దాం “టిరనీ ఆఫ్ క్యాపిటల్” అనుకొన్నాడు శ్రీధర్.
ఓ రోజు శ్రీధర్ ని రాత్రి లేట్ గా పని చెయ్యమన్నాడు ఆనంద్. శ్రీధర్, “నేను లేట్ గా ఎక్కువ పని చేస్తే నాకు ఎక్కువ డబ్బులు రావు కదా!” అన్నాడు ఆనంద్ తో.
” శ్రీధర్! కంపెనీ కీ ఉద్యోగి కీ ఉండేది పరస్పరం సమానమైన సంబంధం కాదు. నువ్వు కంపెనీ లో జాయిన్ అయ్యేటప్పుడు సైన్ చేసిన అగ్రీమెంట్ ని పూర్తిగా చదివావా? చదువు తెలుస్తుంది. డబ్బు ఎవరి నుంచీ అయితే ఫ్లో అవుతుందో వాడిది ఎప్పటికీ పై చేయే. మార్కెట్ బూం లో ఉన్నప్పుడు,ఏదో జనాలను ఆకర్షించటానికి కంపెనీ ల వాళ్ళూ ప్రయత్నిస్తారు. అది వేరే విషయం.  ఐటీ లో ఫ్రెషర్స్ ని వాళ్ళ జావా స్కిల్ కోసమో, సీ స్కిల్ కోసమో తీసుకొంటారు. కానీ లీడ్స్ నీ, మానేజర్లనీ వాళ్ళ కమిట్మెంట్ కోసం, ఇంటెగ్రిటీ కోసం  తీసుకొంటారు. ఈ కమిట్మెంటూ, ఇంటెగ్రిటీ  అనేవి మనకి కుటుంబ నేపధ్యం వలనా, సామాజిక నేపధ్యం వలనా వస్తాయి. ఒక రకం గా మనం మన కమిట్మెంట్ ని అమ్ముకొని ప్రతిఫలం  గా జీతం తీసుకొంటున్నాం. మన వ్యక్తిగతమైన  లక్ష్యాలకీ కంపెనీ లక్ష్యాలకీ ఏ విధమైన ఘర్షణ  లేనప్పుడు, మనకి కమిట్మెంట్ చాలా సులభం గా వస్తుంది. సో, మన కమిట్మెంట్ వలన కంపెనీ కి డబ్బులు వస్తాయి. కానీ విచిత్రం గా ఆ డబ్బు సమాజం జనాలకిచ్చే కమిట్మెంటూ, హానెస్టీ వంటి లక్షణాలని నాశనం చేస్తుంది.ఒక రకం గా డబ్బు తన గోతిని తనే తవ్వుకుంటుంది. అందుకే అనేక సంస్థ లు దివాళా తీస్తున్నయి. టాపిక్ నుంచీ డైవర్ట్ అయ్యినట్లున్నాం.. సో… ఈరోజు రాత్రి పన్నెండయ్యేది,రెండయ్యేది నువ్వు కస్టమర్ కి డెలివరీ చేసి వెళ్తున్నావ్.అంతే”, అని క్లాస్ పీకాడు అనంద్.
“ఛీ వెధవ బతుకు. వీడి క్లాస్ వినేకంటే, రెండింటి దాకా ఉండి ఆ డెలివరీ ఏదో చేసి వెళ్ళటం నయం”,అనుకొన్నాడు శ్రీధర్.

మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456

ఇంకా ఉంది…

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-33

శ్రీధర్ కి స్పృహ తప్పిన తరువాత,ఇల్లు శుభ్రం చేయటం కోసం పని మనిషి వచ్చింది.అతను కిందపడి ఉండటం చూసి ఇంటి ఓనర్ ని పిలిచింది. ఓనర్ దగ్గరే ఉన్న హాస్పిటల్ వాళ్ళని పిలిస్తే వాళ్ళు అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించారు.
అతనికి హార్ట్ ఎటాక్ వచ్చింది. అ రోజు సాయంత్రానికి శ్రీధర్ మామూలు అయ్యాడు. సరళ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. సరళ శ్రీధర్ అమ్మానాన్నలకి ఫోన్ చేసి చెప్పింది. మరుసటి రోజు శ్రీధర్ ని  హాస్పిటల్ నుంచీ ఇంటికి పంపారు.
*********
శ్రీధర్ మంచం మీద కూర్చుని ఉన్నాడు. పక్కనే కుర్చీ లో సరళ కూర్చొని ఉంది. శ్రీధర్ నాన్న కృష్ణా రావూ,అమ్మ చంద్రమ్మా పక్కనే సోఫా లో కూర్చొని ఉన్నారు. శ్రీధర్ సెల్ తీసుకొని ఆనంద్ కి కాల్ చేసి, “నాకు స్ట్రోక్ వచ్చింది,డాక్టర్ ఓ రెండు వారాలు రెస్ట్ తీసుకొమ్మన్నాడు” అని చెప్పాడు.
ఆనంద్, ” నో ప్రాబ్లం శ్రీ, మనీషా ఉంది కదా. ఆమె చూసుకొంటుంది. ఒక రెండు మూడు రోజుల్లో ఆమె నీకు కాల్ చేసి,నీ దగ్గరి నుంచీ ప్రాజెక్ట్ వివరాలు తెలుసు కొంటుంది” అన్నాడు.
“సరే నేనే ఆమె కి కాల్ చేసి చెప్తాన్లే”, అన్నాదు శ్రీధర్.
“నువ్వు ఆఫీస్ కి రావటం మొదలు పెట్టిన తరువాత,కొన్నాళ్ళు ఆమె కి సాయం చేయ వచ్చు. నువ్వు వచ్చాక మాట్లాడుదాం. టేక్ కేర్!” అని పెట్టేశాడు ఆనంద్.
ప్రాజెక్ట్ గురించిన ఆందోళన ఇంకా శ్రీధర్ మనసు లో ఏ మూలో ఉంది. “నేను ఆఫీస్ కి వెళ్ళిన తరువాత, ప్రాజెక్ట్ లో పని మళ్ళీ యధావిధి గా చెయ్యగలుగుతానా?” అనుకొన్నాడు.
సరళ అతని ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ గ్లూకోస్ నీళ్ళు ఇచ్చింది. “నేను లాంగ్ లీవ్ పెట్టి, కొన్నాళ్ళు ఇక్కడ ఉంటాను” అంది.
చంద్రమ్మ అంది, “మేమున్నాం కదమ్మా చూసుకోవటానికి. మళ్ళీ నీ ఉద్యోగానికి ఎందుకు సెలవు పెట్టడం?”
సరళ ఏమీ సమాధానం చెప్పకుండా శ్రీధర్ వైపు చూసి,”నేను సోమ వారం నుంచీ సెలవు పెడుతున్నాను”,అంది.
***********
శ్రీధర్ త్వరగానే కోలుకొంటున్నాడు.  కొంచెం సేద తీరినట్లు కనపడుతున్నాడు. అతనికి కావలసిన వాళ్ళంతా ఒక చోట ఉన్నారిప్పుడు మరి. శ్రీధర్ వాళ్ళ అమ్మ అతనికి ఇష్టమైన కూరలన్నీ చేసి పెడుతోంది,  కానీ నూనె లేకుండా. ఓ రోజు సరళ, “దగ్గరే ఉన్న ఓ రెస్టారెంట్ కి వెళ్దాం” అంది. రెస్టారెంట్ లో, శ్రీధర్ ఎవరికి కావలసినవి వాళ్ళకు తెప్పించాడు.చివరిగా బిల్లు వచ్చింది. శ్రీధర్ బిల్లు కట్టి, ఓ రెండు పది నోట్లను ప్లేట్లో వదిలాడు. కృష్ణా రావు ఆ నోట్ల వంక చూసి శ్రీధర్ ని అడిగాడు, “బిల్ ఎంత అయ్యింది రా?”
“అబ్బ.. నీకెందుకు నాన్నా..?” అన్నాడు శ్రీధర్.
“చెప్పొచ్చు కదా..ఇక్కడ ఖర్చులు ఎలా ఉంటాయో నాకు గూడా తెలుస్తుంది” అన్నాడాయన.
“ఓ ఏదొందల యాభై రూపాయలైంది”.
” బాగానే అయ్యిందే…ఖర్చులు తగ్గించుకో రా. అసలు ఇంతవుతుందని ముందే తెలిస్తే నేను వచ్చేవాడినే కాదు. ఇదే ఇంట్లో వండుకుంటే చాలా తక్కువ పడుతుంది. ఇదే ఖర్చు తో మన ఊళ్ళో ఒక కుటుంబం నెల మొత్తం బతుకుతుంది”
చంద్రమ్మ “మరే” నన్నట్లు గాతలూపింది.
శ్రీధర్ సరళ వంక చూశాడు. ఆమె మొహం లో ఏ భావమూ కనిపించటం లేదు. ఆమె కి ఏదైనా నచ్చక పోతే ఆమె తన మొహానికీ మనసుకీ మధ్య ఒక షట్టర్ వేసేస్తుంది.
ఇంటికొచ్చాక కృష్ణా రావు డీవీడీ లో కొన్ని పాత పాటలు పెట్టమన్నాడు శ్రీధర్ ని. “ఇది చాలా బాగుంది.మన ఇంట్లో టేప్ రికార్డర్ చెడిపోయింది”, అన్నాడాయన.
“నేను మీకు ఓ డీవీడీ ప్లేయర్ కొంటానులే” అన్నాడు శ్రీధర్.
సరళ పక్క రూం లోకి వెళ్ళీ తలుపు వేసుకొంది. చంద్రమ్మ అటు వైపు చూసి,”సరళ కి ఏమైందో చూడు”, అంది శ్రీధర్ తో.
శ్రీధర్ రూం  లోకి వెళ్ళి అన్నాడు,”ఆర్ యూ ఓకే?”
సరళ అంది,” రెస్టారెంట్ లో డిన్నర్ కంటే, డీవీడీ ప్లేయర్ ఎక్కువ అవ్వుతుందనుకుంటా?” అంది.
ఆ మరుసటి రోజు,కృష్ణా రావూ చంద్రమ్మా వెంకటాపురం బయలుదేరి వెళ్ళారు. శ్రీధర్ రైల్వే స్టేషన్ కి వెళ్ళి పంపించి వచ్చాడు. వాళ్ళ కి ఒక డీవీడీ ప్లేయర్ కొనిచ్చాడు. సరళ తనకి తల నొప్పి అని రాలేదు.
ఇంటికొచ్చినాక సరళ అడిగింది, “డీవీడీ ప్లేయర్ ఎంత అయ్యింది?”
“ఎందుకు?”
” ఇలాంటివి కొనమని అడగటానికి ఇది సరైన సందర్భమేనా?” అందామె.
శ్రీధర్ ఏమీ మాట్లాడలేదు.

మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456

ఇంకా ఉంది…

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-32

మనీషా ప్రాజెక్ట్ లోకి వచ్చేసింది. మనీషా వాళ్ళ నాన్న ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ఆమె ఇచ్చిన పనిని చాలా బాగా ఎక్జిక్యూట్ చేయించ గలదు.కానీ ఆమె మాత్రం పని చేయదు.
మనీషా గురించి ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలే ఉన్నాయి. అమె మొదటి జాబ్ డిల్లీ లో చేసింది. తరవాత బెంగుళూరు వచ్చింది. ఆమె డిల్లీ లో ఉన్నప్పుడు తన బాయ్ ఫ్రెండ్ తో విడిపోయింది. ఆమె బెంగుళూరు కి వచ్చిన ఒక సంవత్సరం తరవాత, పునీత్ అగర్వాల్ అని ఒక ముంబాయి అతనిని పెళ్ళి చేసుకొంది. పునీత్ ముంబాయి లోనే ఒక ఫిల్మ్ కంపనీ లో పని చేసేవాడు. వాళ్ళ పెళ్ళి బెంగుళూరు లోనేజరిగింది. కొలీగ్స్ చాలా మంది అటెండ్ అయ్యారు.
ఓ రోజు శ్రీధర్ మనీషా ని అడిగాడు,” ఏంటి? నువ్వు ఈ రోజు చాల డల్ గా కనిపిస్తున్నావు?”
మనీషా శ్రీధర్ వంక చుర చురా చూసి, కను బొమలు ఎగరేసి అంది, “థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. కానీ నీకెందుకీ విషయం?”
ఆమె పునీత్ అగర్వాల్ కి విడాకులిచ్చినట్లు రెండు రోజుల తరవాత తెలిసింది శ్రీధర్ కి. ఆ పైన ఓ నెల రోజులకి,  రోహిత్ శ్రీ వాస్తవ అని పక్కనున్న ఐటీ కంపెనీ లో లొకేషన్ హెడ్, ఆమె ని తన కారు లో డ్రాప్ చెయ్యటం చూశాడు శ్రీధర్. శ్రీధర్ లో ని పల్లెటూరి బావ నిద్ర లేచాడు.మనీషా ని అడిగాడు,” మనీషా,నువ్వు క్యాబ్ లో రావటం లేదేమిటి? ఎవరో నిన్ను రోజూ కార్ లో డ్రాప్ చేస్తున్నట్లున్నారు? “
దానికి మనీషా, “చూడు శ్రీధర్,అది నా సొంత విషయం. నీ కెందుకు? నీ మంచి కోసమే చెప్తున్నా..తరవాత హెచ్ ఆర్ వాళ్ళ తో నీకు ప్రాబ్లం రావటం నాకు ఇష్టం లేదు” అంది. దానితో శ్రీధర్ నోరు మూత పడిపోయింది.
శ్రీధర్ వాళ్ళ ప్రాజెక్ట్ మంచి జోరు గా నడుస్తోంది. టీం మొత్తం టెన్షన్ గానూ,బిజీ గానూ ఉన్నారు. మనీషా కి పాత ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ కి కస్టమర్ మంచి రేటింగ్సే ఇచ్చాడు.
శ్రీధర్ కి  పొద్దున్నే లేచి ఆఫీస్ కి వెళ్ళాలంటే బద్ధకం గా ఉంటోంది. రాత్రి ఏ రెండింటికో రూం కి వస్తున్నాడు. డాక్టర్ కి చూపించుకొందామంటే టైం లేదు. టెన్షన్ వలన కూడా అతని ఆరోగ్యం దెబ్బ తింటోంది.
ఆ రోజు ఒక డెలివరీ ఉంది. ఆఫీస్ కి వెళ్దామంటే, ఉతికిన బట్టలు ఏమీ లేవు రూం లో. మాసిన బట్టలతో ఆఫీస్ కి ఏమి వెళ్తాం లే అనుకొని అతను బట్టలు గుంజటం మొదలు పెట్టాడు. పదకొండున్నర కి ఆఫీస్ నుంచీ ఒక కాల్ వచ్చింది. రిసెప్షనిస్ట్ అంది, ” సర్,మనీషా లైన్ లో ఉంది. కనెక్ట్ చేయనా?”.
మనీషా మాట్లాడుతోంది,” ఆనంద్ ప్రాజెక్ట్ రివ్యూ చేశాడు. అతను ప్రాజెక్ట్ ని నన్ను టేక్ ఓవర్ చెయ్యమన్నాడు. నువ్వు ఆఫీస్ కి ఎప్పుడు వస్తావు? నాకు కేటీ చేయి. ఇప్పటి దాకా జరిగింది అంతా చెప్పు”.
” ఎంత అవమానం. ఆనంద్ గాడు నన్ను ప్రాజెక్ట్ నుంచీ ఫైర్ చేశాడు. ఈ లెక్కన జాబ్ నుంచీ కూడా ఫైర్ చేసేస్తాడేమో? “, శ్రీధర్ గుండెదడ పెరిగింది. చాతీ లో ఎడమ వైపు సన్న గా నొప్పి మొదలైంది. అతనికి స్పృహ తప్పుతోంది.

మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456

ఇంకా ఉంది…

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-31

ఇంకో రెండు రోజుల్లో క్వాలిటీ ఆడిట్ ఉంది. శ్రీధర్ కాన్-ఫిగరేషన్ మేనేజర్ తో కూర్చొన్నాడు. సర్వర్ లో ఉండాల్సిన డాక్యుమెంట్లు ఏమీ లేవు. కాన్-ఫిగరేషన్ మేనేజర్ మోహిత్ అన్నాడు, “నీకెందుకు శ్రీ ఆడిట్ టైం కి అన్ని డాక్యుమెంట్లూ ఉండేలా చేస్తాను కదా”.
శ్రీధర్ మోహిత్ తో మాట్లాడుతూ ఉండగానే ఆనంద్ పిలిచాడు. ఆనంద్ రూం లో మనీషా ఉంది. ఆమె “హాయ్ శ్రీ” అంది.
ఆనంద్ మొదలుపెట్టాడు,” శ్రీ, మన ప్రాజెక్ట్ లో కస్టమర్ తో మాట్లాడే విషయం లో కొన్ని సమస్యలున్నాయి. మనీషా ప్రాజెక్ట్ అయిపోవస్తోంది. ఆమె నీకు కస్టమర్ తో చర్చలు జరిగేటప్పుడు సహాయం చేస్తుంది. దీని వలన నీకు రోజువారీ ప్రాజెక్టు నడపటం మీద దృష్టి పెట్టటానికి కుదురుతుంది”.
శ్రీధర్ సన్నగా నవ్వి, మనీషా తో, “మా ప్రాజెక్ట్ కి స్వాగతం” అన్నాడు ఇంగ్లీషు లో. కానీ అతని మనసు మాత్రం నవ్వటం లేదు. అది అత్తిపత్తి ఆకు లాగా అనుమానాలతో ముడుచుకు పోయింది. “ఆనంద్ ఈమె ని ప్రాజెక్ట్ లోకి తేవటానికి అసలు కారణమేమిటి? ఆమె కస్టమర్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చెయ్యటానికి ఏమి చేస్తుంది?”
************
శ్రీధర్ కి పక్కనే ఒక ఇంటర్నల్ ప్రాజెక్ట్ నడుస్తోంది. జనాలు విసుగూ విరమం లేకుండా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ ఇంటర్నల్ ప్రాజెక్ట్ ల వలన సాధారణం గా ఒరిగేదేమీ ఉండదు. ఇంటర్నల్ ప్రాజెక్ట్ సీరియస్ గా నడవాలంటే, ఆ టీం లో వాళ్ళకి అది ఇంటర్నల్ ప్రాజెక్ట్ అని తెలియకూడదు. కానీ టీం లో వాళ్ళకు ఇంటర్నల్ ప్రాజెక్ట్ అని తెలియకుండా ఒక ప్రాజెక్ట్ నడపటం ఎలానో ఇంకా ఎవరూ కని పెట్టలేదు.
క్వాలిటీ ఆడిట్ రోజు రానే వచ్చింది. శ్రీధర్ ప్రాజెక్ట్ సర్వర్ లోంచీ డాక్యుమెంట్లు తీశాడు. ఆ డాక్యుమెంట్లన్నీ అతనికి ఇంతకు ముందు ఎప్పుడో చూసినట్లనిపించింది. కొంచెం చదివితే అర్ధమయ్యింది, అవి అతను అంతకు ముందు చేసిన ఒక ప్రాజెక్ట్ లో డాక్యుమెంట్లు. అయితే ఆ డాక్యుమెంట్లలోని ప్రాజెక్ట్ పేరు, ప్రాజెక్ట్ నంబరూ, తేదీ మాత్రం, శ్రీధర్ చేస్తున్న ప్రస్తుత ప్రాజెక్ట్ కి సంబంధించినవి. అంతే! ఇదంతా చూస్తే, “రాజకీయ నాయకుడి పర్యటన ముందు, రోడ్లు వేసి, శుభ్రం చేయటం” గుర్తుకు వచ్చింది శ్రీధర్ కి. మోహిత్ ని పిలిచి ఒక క్లాస్ పీకుదామనుకొన్నాడు శ్రీధర్. ఈలోపే ఆడిటర్ అక్కడున్నాడు.
ఆడిటర్ ఫేజ్ ల వారీ గా అన్ని డాక్యుమెంట్లనూ బయటికి తీశాడు. వాటిలో కొన్నిటిని ఓపెన్ చేసి చూశాడు.  వాటిలో ఉన్న టెక్నికల్ విషయాలు అతనికి అర్ధం కావు. చివరి గా అతను శ్రీధర్ కేసి సీరియస్ గా చూసి, “ఆడిట్ రిసల్ట్స్ త్వరలో మెయిల్ చేస్తాను”,అన్నాడు. శ్రీధర్ కి టెన్షన్ పెరిగింది. అతను ఇప్పటికే కస్టమర్ వైపు నుంచీ కష్టాలలో ఉన్నాడు.ఇప్పుడు ప్రాసెస్ సైడ్ నుంచీ కూడా కష్టాలు వచ్చేటట్లున్నాయి.
మరుసటి రోజు ఆడిట్ రిసల్ట్స్ వచ్చాయి,” ఆశ్చర్యం, శ్రీధర్ ప్రాజెక్ట్ ఆడిట్ పాస్ అయ్యింది.
***********

మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456

ఇంకా ఉంది…

Previous Older Entries

Follow

Get every new post delivered to your Inbox.

Join 36 other followers