దేవుడూ హేతువాదుల సంవాదం

సుందరం కళ్ళు తెరిచాడు. చిమ్మ చీకటి. కళ్ళు మూశాడు. ఏమీ కనపడటం లేదు.
ఆరు నెలలు గా గుండె జబ్బు తో తీసుకొంటున్నాడు. రాత్రి నిద్రపోయి మళ్ళీ ఇప్పుడే లేచాడు.
చేతులు విదిలించాడు.అరే చేతులు ఉన్నట్లే లేవే..! కాళ్ళు ఆడించాడు. ఊహూ.. కాళ్ళు కదల లేదు.
“నేను బతికే ఉన్నానా?”
“ఊహు.., నిన్న రాత్రే చనిపోయావు”, ఎక్కడి నుంచో సమాధానం వచ్చింది.

“అరే.., ఎంత ఘోరం జరిగింది..నా పెళ్ళాం పిల్లలు ఎలా బతుకుతారు?…. ఇంతకీ, నువ్వెవరు?”
“నీ భాషలో దేవుడు అంటారు”

“నేను నమ్మను.నాకు జీవితం లో దేవుడెప్పుడూ కనపడలేదు. నేను నాస్తికుడిని,రచయితని ..పైగా హేతు వాదిని…తెలుసా?”
“కనపడితే ఇంకా నమ్మేదేముంది గానీ, ప్రస్తుతం నువ్వు ఎవరి తో మాట్లాడుతున్నట్లో?”

“నమ్మను గాక నమ్మను! మనిషి బుర్రకి బయట, “తెలివిగానీ, ‘తెలివి లో ఉన్న వస్తువు గానీ ,” ఏదీ లేదని మా నాస్తికుల విశ్వాసం”.
“మనిషి తెలివీ చేతనా, నా తెలివీ చేతనా ఒకేవిధం గా ఉంటాయని నీకెవరు చెప్పారు?”

“మా శాస్త్రవేత్తలు ఈ విశ్వం పని చేసే నియమాలను కొన్ని ఎప్పుడో కనిపెట్టేశారు. ఇంకొన్నిటిని కనిపెడుతూ ఉన్నారు.క్వాంటం తీరీ, స్ట్రింగ్ తీరీ మొదలైన వాటిని గురించి నువ్వు ఇంకా వినలేదా?”
“ఆ నియమాలను పెట్టింది ఎవరు? వారికి కనిపెట్టే శక్తిని ఇచ్చింది ఎవరు?”

“అంటే ఆ నియమాలను నువ్వే పెట్టానంటావ్. అయినా సరే నేను నిన్ను నమ్మను. నువ్వు నన్నేం చేసినా సరే..!”
“నన్ను నమ్మని వాళ్ళని దండించటానికి నేనేమైనా నియంతనా..? నన్ను నమ్మిన దుర్మార్గులని నెత్తిన పెట్టుకోవటానికి నేనేమైనా ముఖప్రీతి మనిషినా?”

“సరే..నా మీద కోపం లేదన్న మాట”
“రాగ ద్వేషాలకతీతం గా నా నియమాలప్రకారం పని జరిగిపోతుంది. మీరూ నా నియమాల ప్రకారమే ప్రవర్తిస్తారు.కోపం పెంచుకోవటానికి నేనేమైనా మనిషినా..?. “

“నువ్వు ఈ లోకం నడిచే భౌతిక నియమాలని ఎందుకు మార్చవు? దీనివలన హాకింగ్ వంటి శాస్త్రవేత్తలు,స్థిరం గా ఉండే భౌతిక నియమాలను తెలుసుకొంటే చాలు,  నిన్ను తెలుసుకొనకపోయినా వచ్చే ప్రమాదమేమీలేదంటున్నారు కదా? “
“నువ్వు రచయితవి కదా? నీకు శిల్పం యొక్క ప్రాముఖ్యత తెలిసేఉండాలి. లోక నియమాలని మారిస్తే నా లోక రచన లో శిల్పం దెబ్బతింటుంది. నా శిల్పం మీకు అర్ధం కాదులే . అది “అధిభౌతిక శిల్పం”. శిల్పాన్ని దెబ్బతీయటం ఉచితం కాదు కదా? “

“నీ ఉనికిని మా శాస్త్ర వేత్తలు ఎప్పటికైనా నిరూపించగలరా ?”
“సిధ్ధాంతపరం గా నిరూపించవచ్చు. కానీ నేనుండే లోకం వేరు.నా కొలతలు వేరు. మీకు నా లోకం లోకి ప్రవేశం లేదు. నా లోకం, మీ లోకం లోని నియమాల ప్రకారం పని చేయదు. మీ లోకం నా పరిధి లోని ఒక చిన్న నలుసు మాత్రమే! నా ఉనికిని మీ లోకం లోని నిజ జీవితం లోని దృగ్విషయాలాతో నిరూపించటం అయ్యేపనేనా? “

దేవుడు నన్ను మళ్ళీ బ్రతికిస్తాడేమో.నమ్మితే పోయిందేముంది. ఆయన తో  మంచి గా మాట్లాడదాం….అనుకొన్నాడు సుందరం లోలోపల.  దేవుడికి సుందరం మనసులోని  మాటలు వినపడుతూనే ఉన్నాయి.

“స్వామీ, మమ్మల్ని సృష్టించింది నువ్వే కదా..అంటే, మేము చేసే చెడ్డ పనులకి నీకు కూడా బాధ్యత ఉంటుంది కదా..?”
“నువ్వు నెమ్మది గా ఆస్తికుడివై పోతున్నావనుకొంటా..మీకు స్వేఛ్ఛా సంకల్పం ఇచ్చాను కదా?దానిని పరిస్థితులకి అతీతం గా ఉంచుకోవాల్సిన బాధ్యత మీది కాదా?”

“అంటే, మంచి తో పాటు చెడు చేసే స్వేఛ్ఛ కూడా నువ్వే ఇచ్చావన్నమాట!అసలు మనిషి చెడు చేసే ఆస్కారం నువ్వు కలిగించకుండా ఉంటే పోయేది కదా..? ఆ..అయినా, నువ్విచ్చిన స్వేఛ్ఛా సంకల్పం లో ని స్వేఛ్ఛ నేతి బీరకాయ లోని నెయ్యి లాంటిది లే స్వామీ, అవునూ, ఎప్పటినుంచో నువ్వు కనపడితే అడగాలనుకొంటాను స్వామీ. జనాలకి ఇంత  బాధలను ఎందుకు పెడతావు. ప్రళయాలూ, ప్రమాదాలూ ఎందుకు సృష్టిస్తావు? నువ్వు చెడ్డ వాడివా, మంచి వాడివా?”
“నేను మాత్రం కావాలని చేస్తానా?మంచి చెడులు మానవ సమాజాలు సృష్టించినవి. అనిర్వచనీయుడనైన నాకు మీ మంచి చెడులను ఎందుకు వర్తింప చేస్తున్నారు?

“కావాలని చేయవా..? అంటే నీ మీదా ఈ ప్రపంచం మీదా నీకు అదుపు లేదా స్వామీ..?”
“అదుపు అనేది, నియంత్రించటం అనేది మనుషుల లక్షణం కాదా? మీ లక్షణాలని నాకు ఆపాదిస్తే ఎలా?”

“సరే..మరి నిన్ను ఎవరైనా అదుపు చేస్తున్నారా? ఎవరైనా సృష్టించారా?”
“నన్నెవరూ సృష్టించలేదు. నాకు కారణం లేదు.నాకు మొదలు లేదు.చివర లేదు. నేనే అన్నిటినీ సృష్టించాను. అన్నిటిలోంచీ నేను వచ్చాను. అన్నీ నేనే. నేనే అన్నీ. కార్య కారణ సంబంధం మీ ప్రపంచం లోది కదా?”

ఈయనకు మొదలు లేదు, చివర లేదంట. నేనడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వకుండా భలే తప్పించుకొంటున్నాడే! అనుకొని, సుందరం, “నీకు మొదలే లేదా? నేను నమ్మను..అదెలా సాధ్యం స్వామీ?”అన్నాడు.
వెంటనే సుందరం కళ్ళముందు వెలుగుతో ఒక వృత్తం ప్రత్యక్షమైంది.
“ఈ వృత్తం చుట్టూ పోతే ఏది మొదలు? ఏది చివర? ప్రతి ప్రదేశమూ మొదలే. ప్రతిదీ చివరే. నీవు ఏది మొదలు అనుకొంటే అదే మొదలు కాదా?”

“నీ ఉదాహరణ ప్రకారం, ప్రతి విషయానికీ ముందు వేరొక విషయం ఆదిగా ఉంది కదా స్వామీ?”
“నా లోకం లో కార్యమూ కారణమూ ఒకే సమయం లో జరుగుతాయి. ఒకే బిందు సమానమైన సమయం లో కాలాలన్నీ ఉంటాయి. ఒక ప్రదేశం లోనే అనేక వస్తువులు ఉంటాయి. “

 ”ఏంటో! మా క్వాంటం తీరీలూ, స్ట్రింగ్ తీరీలూ చెప్పినట్లు గా నువ్వు మాట్లాడుతున్నావు. ఇంతకీ, నువ్వు ఏ కాలం లో ఉన్నావు స్వామీ?”
“అన్ని కాలాలలోనూ ఉన్నాను. కొండమీది నుంచీ చుట్టుపక్కల చెట్లన్నీ కనపడినట్లే, నాకు కాలాలన్నీ ఒక్క క్షణం లోనే కనపడుతాయి. ఏ కాలాన్నైనా నేను స్పృశించగలను. అన్ని కాలాలలోనూ నేను ప్రవేశించగలను. కాలాన్ని నేను ఆపగలనూ, పరుగులు పెట్టించగలను. అయితే, నా కాలం మీ కాలం కంటే భిన్నమైనది కదా?”
“ఏమిటో స్వామీ, నన్ను గందర గోళం లోకి నెట్టేశారు. నేను మీలా  నిన్నటి వస్తువునీ రేపటి వస్తువునీ ప్రస్తుతం ఎందుకు స్పృశించలేను స్వామీ?”
“నీ లోకం లో కార్యమూ కారణమూ వేర్వేరు గా ఉన్నపుడు, “కార్యమైన నీ ప్రస్తుత లోకం లో ఉన్న నీవు కారణమైన నిన్నటిని ఎలా స్పృశించగలుగుతావు?”
 

“మీరు మాడైమన్షన్లో ఉన్నట్లు అగుపడటంలా.. ఏ ఆరో డైమన్షన్లోనో..ఏడో డైమన్షన్లోనో ఉన్నారా?  ఏదేమైనా, కాలాన్నే అదుపు చేయగల మీరు సామాన్యులు కారు”

“ఇందులో మనుషులు చేసినట్లు గా అదుపు ఏమీ లేదు. కాలమూ, లోకమూ, నేనూ వేరు వేరు కాదు. అంతా ఒక్కటే కాదా?”

“మీరు ఎవరైనా నాకు  చేతులు జోడించాలనిపిస్తోంది. ఒక్క సారి నాకు కనపడండి స్వామీ!”
“నేను నిర్గుణుడను, నిరాకారుడను, అనిర్వచనీయుడను, అమేయుడను.  నన్ను నీవు చూడలేవు. భక్తి అనేది అమిత బలవంతుడైన ఇష్టుడిని చూసినపుడు మనుషులలో కలిగే ఇష్టం తో కూడిన భయం.  దీనికీ మనుషుల మనుగడకీ సంబంధం ఉంది.  నీ భక్తి కీ నా ప్రత్యక్షానికీ సంబంధం ఏమీ లేదు.నీ చర్మ చక్షువుల తో నన్ను గ్రహించలేవు. దివ్య చక్షువులివ్వటానికి భక్తి ఒక్కటే సరిపోతుందా?”

“సరే స్వామీ, నా ప్రశ్నలన్నిటికీ మీ ప్రశ్నలతో బ్రహ్మాండం గా సమాధానం చెప్పారు. ఒక్క సారి నన్ను మళ్ళీ  బతికించండి స్వామీ!. అరే! ఏదీ సమాధానం రాదే? ఆ దేవుడా పాడా. లేనే లేదు.. లేక పోతే నా ప్రశ్నకు సమాధానం ఎందుకు చెప్పడు?”

సమానత్వం : తాత్విక దృష్టి కోణం

Disclaimer: ఈ టపా సమాజం లో ఉండే అనేక రకాల వివక్షలను సమర్దించటానికి కాదు.

“అహం బ్రహ్మాస్మి, తత్వమసి” అని మన పెద్దలు చెప్పారు. (ఈ సూక్తి మన వేదాలలో ఉందా, ఉపనిషత్తులలో ఉందా, శంకరుడు చెప్పాడా, లేక పురాణాలలో ఉందా అనేది నాకు తెలియదు. తెలిసిన వారు కొంచెం చెప్తారా?).
మనలో చాలా మంది మొదటి దైన “అహం బ్రహ్మాస్మి” అనే దానిని అమలు లో పెడతారు (In an egotistic way :-)  ). మిగిలిన భాగం అమలు లో పెట్టటం చాలా కష్టం.
మనలో విద్యా వంతులైన వారు ఎదుటి మనిషి మన వంటి వాడే అనే విషయాన్ని బుధ్ధిపరం గా అర్ధం చేసుకోగలరు. కానీ practical గా అమలు చేయం.భావోద్వేగ పరం గా ఇతరుల భావోద్వేగాలు మన భావోద్వేగాలకి ఎప్పటికీ సమానం కావు. భావోద్వేగం అనేదే మన అస్థిత్వం నుంచీ పుడుతుంది. మన ఆలోచనలన్నీ మన లాభ నష్టాల చుట్టూనే తిరుగుతాయి. మన శారీరక భౌతిక అవసరాలు మనవి. ఎదిటి వాడి ఆకలి మనకు వేయదు కదా! ఎదుటి వాడి రోగం మనం ఫీలవ్వం. ఎదుటి వాడి ముసలితనం వాడిదే! మానసికం గా “నేను” అనే వస్తువే గతకాలపు జ్ఞాపకాల, ఆలోచనల , అనుభవాల సమాహారం.ఈ నేను కి ఎదురైన పరిస్థితులు దానిని మారుస్తూ ఉంటాయి.ఇతరులకి ఎదురైన పరిస్థితులు , నాకు ఎదురైన పరిస్థితులకు పూర్తి గా భిన్నమైనవి కావచ్చు. అలాంటి నేను ఎదుటి మనిషి తో ఆలోచనా పరం గా, భావోద్వేగ పరం గా, వ్యవహార పరం గా సమానత్వాన్ని ఎలా సాధిస్తుంది?తమ తమ అభిప్రాయాలకీ, భావోద్వేగాలకీ, ఆలోచనలకీ ప్రాముఖ్యతని ఇచ్చుకోని వ్యక్తులను మనమెక్కడైనా చూస్తామా? మన శరీరం కార్చే అనేక శరీర ద్రవాలూ మలినాలు అంటే మనకి అసహ్యం ఉండదు. అదే ఇతరుల ద్రవాలంటే మనకు జుగుప్స ఉంటుంది.
మన అస్థిత్వమే మన మనుగడ (survival) నుంచీ ఆవిర్భవించింది. కాబట్టీ, సర్వ మానవ సమానత్వం అనేది మన నుంచీ మొదలవ్వాలి. కానీ, ఒక్క మేధో పరం గా కాకుండా, ఏ ఇతర ప్లేన్ లో ( emotional, survival, practical, physical,psycological and thoughts) చూసినా మనం మనకు ఇచ్చుకున్న ప్రాముఖ్యతను ప్రపంచం లో వేరే ఎవరికీ ఇవ్వం.
ఇతరుల ఆలోచనలకీ , వారి అనుభవాలకీ మనకు access లేదు. వారి మానసిక ప్రపంచానికి వారికే access ఉంది. అందరి మనుషులకీ ఉమ్మడి గా ఉండే కొన్ని అనుభూతుల ద్వారానే మనం వారితో communicate చేయగలం. మనతో మసలే మన స్నేహితులూ, బంధువుల ఆలోచనలకి మనకు కొంతవరకూ access ఉంటుంది. కాబట్టీ మనం వారికిచ్చే weightage/priority లోకం లో ఇతరులకి ఇచ్చే విలువ కంటే ఎక్కువగా ఉంటుంది.

ఇలాంటప్పుడు ఇతరులంటే మనకు కొంత మానవీయమైన సహానుభూతి ఉండవచ్చు, కానీ మానసిక మైన సమానత్వం మాత్రం రాదు. అది ఒక ఆచరణ లో పెట్టలేని ఆదర్శం మాత్రమే అనిపిస్తుంది.   We all are similar, but we are not identical  .

సర్వ మానవ సమానత్వమే ఇలా ఉంటే, ఇక సర్వ జీవ సమానత్వం సంగతి ఆలోచించాల్సిందే!

మనమంతా ఒకే శక్తితో, ఒకే ఎలక్ట్రాన్లూ, అణువులూ వగైరాలతో చేయబడి, ఒకే శూన్య మూలాల నుంచీ, భౌతిక-అధిభౌతిక కారణాలవలన వచ్చినప్పటికీ, వాస్తవం గా ఈ అసమానత్వం తప్పేటట్లు లేదు.

మన శరీరమూ,  మనసూ, రోబో ల తరహా లోమాస్ ప్రొడ్యూస్ అయితే తప్ప,  మనమందరం సమానం కామేమో! మాస్ ప్రొడ్యూస్ అయిన రోబో ల లో కూడా వాటి సామర్ధ్యాలలో తేడాలు ఉంటాయి!

అతీంద్రియ శక్తులు : నా అనుభవాలూ, ఆలోచనలూ, వైఖరి.

ఒక బాబా గారు గాల్లోంచీ అరటి పండు తీసి చేతి లో పెడతాడు. వేరొక బాబా ఇతరుల బుర్ర లోని ఆలోచనలను చెబుతాడు. దీనిని మనం నమ్మాలా? కనికట్టు అని కొట్టి పారేయాలా? నమ్మకూడదా? లేక బాబా గారిని మన యూనివర్సిటీ లాబ్ లో అదే అద్భుతం చేయమని సవాలు చేయాలా?   ఇలాంటి మహిమల్ని నమ్మితే, అది శాస్త్రీయ దృష్టి అవుతుందా?
నా చిన్నతనం లో మా అత్తగారి ఊరి లో ఉండేవాడిని. ఓక రోజు “లవకుశ” సినిమా చూస్తున్నట్లుగా ఓ కల వచ్చింది. వాస్తవం లో అంతకు ముందు ఆ సినిమా ను నేను చూసి ఉండలేదు. ఆ మరుసటి రోజు మా నాన్న మా ఊరినుంచీ వచ్చి, నన్ను మా ఊరు తీసికెళ్ళి, అక్కడ ఆడుతున్న లవకుశ సినిమా చూపించారు. సినిమాలంటేనే గిట్టని మా నాన్న నాకు జీవితం లో చూపించిన ఒకే ఒక్క సినిమా అది! తరువాత ఈ అనుభవం గురించి ఆలోచించుకొని, “ఆ..కాకతాళీయం అయి ఉంటుంది లే!”, అని కొట్టి పారేశాను. ఈ సంఘటన లో భవిష్యత్తు గురించి చెప్పే విద్య నాకు తెలియదని చెప్పక్కర్లేదు.

పెద్దయ్యాక కొడవటిగంటి కుటుంబరావు గారు రాసిన తాత్విక వ్యాసాలు కొన్ని చదివాను. వాటిలో ఆయన మానవాతీత శక్తులు ఉండవచ్చుననీ, మనం ఈ విషయాన్ని శాస్త్రీయ దృక్పధం తో, ఓపెన్ మైండ్ తో చూడాలనీ రాశారు. ఆయన తనకు జరిగిన ఒకటిరెండు అసాధారణ అనుభవాలను కూడా పంచుకొన్నారు.(ఆయన కు కలిగిన అనుభవాల లో Out of body experience ఒకటి ఉంది . తరువాతి కాలం లో సైంటిస్ట్ లు దీనికి శాస్త్రీయం గా వివరణ ఇవ్వగలిగారు.)

ఆయన లాంటి హేతువాదీ, మార్కిస్టూ వెలిబుచ్చిన అభిప్రాయాలతో, నేను అలౌకిక అనుభవాల గురించి సందేహం లో పడ్డాను. ఆయన “యూరీ గెల్లర్” అనుభవాల గురించీ, మరణానంతర జీవితం గురించిన కొన్ని అమెరికన్ వార్తా వ్యాఖ్యల గురించి కూడా రాశారు. అయితే అమెరికన్ పత్రికల వ్యాపారీకరణ తెలిందే కాబట్టీ నేను ఆ కథనాల కి పెద్ద విలువ ఇవ్వలేదు. పత్రిక అమ్ముకోవటం కోసం రాసిన కట్టుకథలు గానే వాటిని చూశాను. కుటుంబరావు గారి ప్రకారం…

“ఈ విశ్వం స్థల కాలాల నాలుగు కొలత (డైమన్షన్) లతో పాటు, బుధ్ధి కొలతలో కూడా పరిణామం చెందింది. అంటే బయట విశ్వం లొ ఎక్కడో ఇంటెలిజెన్స్ ఒకటి ఉంది. ఈ బుధ్ధి లేక ఇంటెలిజెన్స్ విశ్వం తో పాటు పరిణామం చెందుతూ వస్తోంది. మొదట్లో జీవపరిణామం లో,ఆదిమ దశ లో ఉన్న మానవుడికి ఈ బుధ్ధి నేరు గా సహాయం చేసేది. ఆ సహాయం అతీంద్రియ శక్తుల రూపం లో ఉండేది. కాబట్టీ ఆ రోజుల్లో అతీత శక్తులు చాల సాధారణం గా ఉండేవి. తరువాత మనిషి మేధ పెరిగే కొద్దీ, వాటి అవసరం మనిషికి తీరిపోయింది. మనిషి కి ఈ అతీత శక్తుల మీద అదుపు లేనట్లు కనిపిస్తుంది. అవి కావాలనుకొంటే ఓ మనిషిలో ప్రత్యక్షమౌతాయి..లేకపోతే లేదు.”

కుటుంబ రావు గారి బుధ్ధి కొలత ప్రతిపాదన ఆ రోజులలో విమర్శలను ఎదుర్కొంది. ఆయన హేతు వాద మరియూ మార్క్సిస్ట్ అర్హతల పైన కొందరు సందేహాలు వెలిబుచ్చారు. అయితే ఆయనది కేవలం ప్రతిపాదన మాత్రమే. అది శాస్త్రీయ సిధ్ధాంతం గా అంగీకరించబడాలంటే దానిని ప్రపంచం లో మనం పరిశీలించదగిన ఒక విషయం లో నిరూపించాలి. ఆయన అలా చేయలేక పోయారు. తన ప్రతిపాదనని ఆయన అమెరికా లో ఉండే తన స్నేహితులైన కొందరు భౌతిక శాస్త్రవేత్తలతో కూడా పంచుకొని, దాని నిరూపణ కి ఏదైనా ఒక ప్రాతిపదిక దొరుకుతుందేమో అడిగారు. ఆయన ప్రతిపాదన ఇప్పటి క్రియేషనిస్ట్ సిధ్ధాంతానికి దగ్గర గా ఉన్నట్లు నాకు తరువాత అనిపించింది.

అప్పుడప్పుడూ మన కు తారస పడే, మాధ్యమాలలో కనిపించే, మహిమలు నాకు ఒక ద్వైధీ భావాన్ని కలిగించ సాగాయి. వాటిని మూఢనమ్మకాలని కొట్టి పారేయాలా? లేక వాటి గురించి శాస్త్రీయం గా పరిశోధించి తెలుసుకోవాలా? లేక పోతే నిప్పులేకుండా పొగ రాదని వాటిని నమ్మాలా?
మనం వింటూ ఉండే అతీత శక్తులలో కొన్ని: “ఎదుటి వారి ఆలోచనలను తెలుసు కోవటం, వస్తువులను చూపులతో వంచటం, శరీరం ఇనుప వస్తువులను ఆకర్షించటం, గాలిలో తేలటం, భవిష్యత్తు గురించి చెప్పటం, మరణానంతర జీవితం అనుభవం లోకి రావటం, చనిపోయిన వారిని బతికించటం, శూన్యం లోంచీ వస్తువులను సృష్టించటం, ఇవి కొన్ని మాత్రమే!”
అయితే వీటిలో కొన్నిటిని చేయటానికి భౌతిక ప్రాతిపదిక ఉండవచ్చు. సైన్స్ ఇంకా వీటి మెకానిజం ని కనిపెట్టి ఉండక పోవచ్చు. ఉదాహరణ కి ఎదుటి వారి ఆలోచనలు తెలుసుకోవటం గురించి…
మన ఆలోచనలకు విద్యుతయస్కాంత గుణం ఉంటుంది. మామూలు మనిషిలో ఆలోచన లు గజి బిజి గా ఉంటాయి. కొందరు యోగులు ధ్యానం ద్వారా తమ ఆలోచనలను క్రమబధ్ధీకరించి, వాటి ఇంటెన్సిటీని పెంచుకోగలరు. అలానే వారిమనసు ప్రశాంతం గా ఉన్నపుడు ఎదుటి వారి ఆలోచనల సున్నితమైన తరంగాలని గ్రహించగలరు. అది ఒక పధ్ధతి. కానీ ఇది నిరూపించబడలేదు.భవిష్యత్తు లో సైన్స్ దీనిని నిరూపిస్తుందేమో!

అలానే శరీరం తో  ఇనుప వస్తువులను ఆకర్షించటం అనేది నాకు తెలిసిన ఒక వ్యక్తి చేస్తాడు. శాస్త్రజ్ఞులు దీనిని ఇంకా అర్ధం చేసుకోవలసి ఉంది.

ఈ మధ్య “మన భౌతిక ప్రపంచం అవతల మన సైన్స్ ఎప్పటికీ చేరలేని అధిభౌతిక ప్రపంచం ఉంటుంది”, అని నేను విశ్వసించటం ప్రారంభించాను. దీనికి రెండు కారణాలు.

1. ఈ విశ్వం అనేది కారణ రహితమైన ఒక స్థితి నుంచీ పుట్టిందని శాస్త్రజ్ఞుల మధ్య ఉన్న ఒక అభిప్రాయం. విశ్వానికి ఐదో కొలతో , ఆరో కొలతో ఉన్నట్లైతే దానిని మన సైన్స్ ఎప్పటికీ నిరూపించలేదు. అలాంటి ఐదో కొలత గురించి సైన్స్ కేవలం ఊహాగానం మాత్రమే చేయగలదు. అలానే విశ్వ సృష్టి స్థల కాలాల ఆవల జరిగిందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. స్థల కాలాలు లేకుండా జరిగిన విశ్వసృష్టిని శాస్త్రీయ నిరూపణ ల పరిధి లోకి లాక్కు రావటాన్ని ఊహించటం కష్టం.
2. ఇక రెండవ కారణం, క్వాంటం తీరీ లాంటివి, కారణ రహితమైన “వాక్యూం ఫ్లచుయేషన్” వంటి వాటిని అంగీకరిస్తున్నాయి. దీని ప్రకారం ఎలక్ట్రాన్ లాంటి కణాలు ఏ కారణం లేకుండానే శూన్యం లోంచీ పుట్టి, మళ్ళీ శూన్యం లోనే కలిసిపోతాయి, బాబా గారు శూన్యం లోంచీ విభూతి తీసినట్లు. ఇలాంటి విషయాలను “ఐదో డైమన్షన్” లేకుండా వివరించటం సాధ్యం కాదు. కానీ ఐదో డైమన్షన్ లోకి మనిషి కి ప్రవేశం లేదు. కాబట్టీ వీటిని నిరూపించటం మనిషికి సాధ్యపడక పోవచ్చు.కాబట్టీ మనిషి ఎప్పటికీ అనుభవించలేని అధి భౌతిక జగత్తు ఒకటి ఉంటుంది. ((ఐతే ఈ అధి భౌతిక జగత్తు గురించి ఎవరేమి చెప్పినా నమ్మేయాలా? ఈ అధి భౌతిక ప్రపంచం లోనే దేవుడు ఉండి సృష్టిని శాసిస్తున్నాడంటే నమ్మేయాలా? అధి భౌతిక ప్రపంచ నియమాలు భౌతిక ప్రపంచ నియమాల లా ఉంటే , “అలా నమ్మ కూడదు”. కానీ సైన్స్ దీనిని నిరూపించలేదు. ఎందుకంటే మనిషికి అక్కడ ప్రవేశం లేదు.స్థల కాలాలే లేని చోట దేవుడు ఒక మోటివేషన్ తో ఉంటాడా?ఆయన ఎలక్ట్రాన్లూ, పాజిట్రాన్లూ వంటి చిన్న కణాలను సృష్టించే విషయం లో మాత్రమే ఎందుకు జోక్యం చేసుకొంటాడు. మిగిలి విశ్వమంతా మనకు తెలిసిన రూల్స్ ప్రకారమే ఎందుకు నడుస్తుంది?))

అలానే, ఎలక్ట్రాన్లు ఒక చోట మాయమై, కొంచెం దూరంలో ప్రత్యక్షమౌతాయి. దీనినే క్వాంటం జంప్ అంటారు. క్వాంటం తీరీ చదివితే ఈ విశ్వమంత ఒక మాయ అనిపిస్తుంది. మౌలిక కణాలన్నీ(పదార్ధం అంతా) ,  శక్తి తో చేయబడి ఉన్నాయి. ప్రస్థుతం ఒక కణం ఉందా లేదా అనేది ఆ కణం యొక్క భూత భవిష్యత్ స్థితుల పై ఆధారపడి ఉంటుంది.
సరేనండీ, నేను అధిభౌతిక ప్రపంచం గురించి నమ్మటం మొదలు పెట్టాను. అయితే ఏమిటంట? నిజజీవితం లో చూపబడే మహిమలన్నీ మోసాలే అవ్వనక్కరలేదు. వాటిలో కొన్నిటికి మూలాలు ఈ అధిభౌతిక ప్రపంచం లో ఉండవచ్చు. ఉదాహరణకి శూన్యంలోంచీ వస్తువులను తీయటం, శూన్యం లోంచీ ఎలక్ట్రాన్లు పుట్టవచ్చు అని సైన్స్ చెప్పిన దానికి దగ్గరగానే ఉంది కదా!
ఇక ఈ మధ్య నేను పరమహంస యోగానంద గారు రాసిన, “ఒక యోగి ఆత్మ కథ” అనే పుస్తకం చదివాను. ఆ పుస్తకం నిండా నేను పైన చెప్పిన అనేక మహిమలు ఉన్నాయి. అందులో యోగానంద గారు ఆ మహిమలకు సైన్స్ పరమైన సమర్ధన కూడ ఇచ్చారు. వాటిని వివరించటం లో ఆయన స్వరం చాలా నమ్మదగినదిగా ఉంది. దానితో నేను, “ఏమో ఈ మహిమలు కూడా నిజమేనేమో”, అనే స్థితి కి చేరాను.”ఆ మహిమలకు భౌతికం గా ఇంకా కని పెట్టబడని కారణం ఉండవచ్చునేమో. లేకపోతే, ఈ మహిమల మూలాలు అధిభౌతిక జగత్తులో ఉండ వచ్చునేమో?! “గొప్ప యోగులు అధిభౌతిక జగత్ లోని నియమాల ద్వారా మహిమలను చూపించగలరేమో!

కొన్ని రోజుల తరువాత ఇంటర్నెట్ లో యోగానంద గారి గురించి ఒక కెనడియన్ రాసిన ఒక పుస్తకం లోని విషయాలు చదివాను. ఆయన యోగానంద గారి గురించి పూర్తి నెగటివ్ ధోరణి లో రాశారు. మొత్తానికి యోగానంద గారు చెప్పినవి చాల వరకూ తప్పులూ లేక అబధ్ధాలు అన్నట్లు గా రాశాడు. అది చదివిన తరువాత నాకు కొన్ని వ్యతిరేక ఆలోచనలు రావటం మొదలయ్యాయి. “గాలిలోంచీ వస్తువులు సృష్టించేవారు, మానవులందరికీ సరిపడా ఆహారం ఎందుకు సృష్టించరు?అలా అయితే ఎంతమందో అన్నార్తులకి ఆకలి బాధ తప్పించిన వారవుతారు కదా? అలానే భవిష్యత్తు గురించి చెప్పేవారు,భూకంపాలగురించి ఎందుకు చెప్పరు?ఎదుటి వారి ఆలోచనలనూ, భవిష్యత్తునూ తెలుసుకొనగలిగిన వారు, రాబోయే తరాల సైంటిస్ట్ ల మెదళ్ళలోని సిధ్ధాంతాలను పసిగట్టి, ముందుగానే శాస్త్రీయఆవిష్కారాలు ఎందుకు చేయరు? అంటే ఈ విద్యలన్నీ కేవలం మాజిక్కేనా? మోసమేనా?

ఈ ఆలోచనల తరువాత, నాకనిపించిందేమంటే..
–ఎవరైనా మహిమలను ప్రదర్శిస్తే వాటిని వెంటనే కొట్టిపారేయవలసిన అవసరం లేదు. అలా అని వెంటనే నమ్మవలసిన అవసరం లేదు. ఆ మహిమను అంగీకరించటానికి కొలబద్ద సైన్సే. ప్రయోగ శాల పరిస్థితులలో వారు అ మహిమను చూపించగలిగితే, సైన్స్ అది ఇంకా తెలుసుకోబడని విషయం గా అంగీకరించటనికి సిధ్ధం గానే ఉంటుంది. తమ శక్తుల మీద తమకు అదుపు లేని వారు, ఆ శక్తులు తమకు ఉన్నపుడే చూపించవచ్చు. నాకు తెలిసిన ఒక మనిషికి అయస్కాంత శక్తి ఉంది అని చెప్పాను కదా? ఆ మనిషిని శాస్త్రజ్ఞులు పరిశీలించి, అతని శక్తి కి కారణం తెలియలేదనీ. దాని పై ఇంకా పరిశోధనలు చేయాలనీ ఒప్పుకొన్నారు. కారణం లేకుండా జనించిన ఎలక్ట్రాన్లనే ఒప్పుకొన్న సైన్స్, పరిశోధనల తరువాత అతని అయస్కాంత శక్తికి కారణం తెలియకపోతే, ఆ విషయాన్ని కూడా ఒప్పుకొంటుంది. చివరికి చెప్పవలసిన విషయమేమిటంటే, మహిమల గురించి ప్రధమం గా నమ్మ క పోవటమే మంచిది. అలా నమ్మకపోవటం అనేది నిజానికి దగ్గర గా ఉంటుంది. ఏ కోటికో, ఒక మహిమ నిజమైనా, దానిని సరిగా నిరూపించబడిన తరువాతే నమ్మటం మంచిది.

ఎలక్ట్రాన్లు శూన్యం లోంచీ పుడతాయంటే నమ్ముతాను. శూన్యం లోంచీ అరటి పండు తీశాడంటే, ముందు నమ్మను. ఒక వేళ అదే పనిని ప్రయోగశాల లో చేసి చూపిస్తే అప్పుడు నమ్ముతాను.

Follow

Get every new post delivered to your Inbox.

Join 36 other followers