దేవుడూ హేతువాదుల సంవాదం
05 డిసెం 2011 అభిప్రాయములు
in ఆధ్యాత్మికం, విశ్వమూ దేవుడూ, సైన్స్
సుందరం కళ్ళు తెరిచాడు. చిమ్మ చీకటి. కళ్ళు మూశాడు. ఏమీ కనపడటం లేదు.
ఆరు నెలలు గా గుండె జబ్బు తో తీసుకొంటున్నాడు. రాత్రి నిద్రపోయి మళ్ళీ ఇప్పుడే లేచాడు.
చేతులు విదిలించాడు.అరే చేతులు ఉన్నట్లే లేవే..! కాళ్ళు ఆడించాడు. ఊహూ.. కాళ్ళు కదల లేదు.
“నేను బతికే ఉన్నానా?”
“ఊహు.., నిన్న రాత్రే చనిపోయావు”, ఎక్కడి నుంచో సమాధానం వచ్చింది.
“అరే.., ఎంత ఘోరం జరిగింది..నా పెళ్ళాం పిల్లలు ఎలా బతుకుతారు?…. ఇంతకీ, నువ్వెవరు?”
“నీ భాషలో దేవుడు అంటారు”
“నేను నమ్మను.నాకు జీవితం లో దేవుడెప్పుడూ కనపడలేదు. నేను నాస్తికుడిని,రచయితని ..పైగా హేతు వాదిని…తెలుసా?”
“కనపడితే ఇంకా నమ్మేదేముంది గానీ, ప్రస్తుతం నువ్వు ఎవరి తో మాట్లాడుతున్నట్లో?”
“నమ్మను గాక నమ్మను! మనిషి బుర్రకి బయట, “తెలివిగానీ, ‘తెలివి లో ఉన్న వస్తువు గానీ ,” ఏదీ లేదని మా నాస్తికుల విశ్వాసం”.
“మనిషి తెలివీ చేతనా, నా తెలివీ చేతనా ఒకేవిధం గా ఉంటాయని నీకెవరు చెప్పారు?”
“మా శాస్త్రవేత్తలు ఈ విశ్వం పని చేసే నియమాలను కొన్ని ఎప్పుడో కనిపెట్టేశారు. ఇంకొన్నిటిని కనిపెడుతూ ఉన్నారు.క్వాంటం తీరీ, స్ట్రింగ్ తీరీ మొదలైన వాటిని గురించి నువ్వు ఇంకా వినలేదా?”
“ఆ నియమాలను పెట్టింది ఎవరు? వారికి కనిపెట్టే శక్తిని ఇచ్చింది ఎవరు?”
“అంటే ఆ నియమాలను నువ్వే పెట్టానంటావ్. అయినా సరే నేను నిన్ను నమ్మను. నువ్వు నన్నేం చేసినా సరే..!”
“నన్ను నమ్మని వాళ్ళని దండించటానికి నేనేమైనా నియంతనా..? నన్ను నమ్మిన దుర్మార్గులని నెత్తిన పెట్టుకోవటానికి నేనేమైనా ముఖప్రీతి మనిషినా?”
“సరే..నా మీద కోపం లేదన్న మాట”
“రాగ ద్వేషాలకతీతం గా నా నియమాలప్రకారం పని జరిగిపోతుంది. మీరూ నా నియమాల ప్రకారమే ప్రవర్తిస్తారు.కోపం పెంచుకోవటానికి నేనేమైనా మనిషినా..?. “
“నువ్వు ఈ లోకం నడిచే భౌతిక నియమాలని ఎందుకు మార్చవు? దీనివలన హాకింగ్ వంటి శాస్త్రవేత్తలు,స్థిరం గా ఉండే భౌతిక నియమాలను తెలుసుకొంటే చాలు, నిన్ను తెలుసుకొనకపోయినా వచ్చే ప్రమాదమేమీలేదంటున్నారు కదా? “
“నువ్వు రచయితవి కదా? నీకు శిల్పం యొక్క ప్రాముఖ్యత తెలిసేఉండాలి. లోక నియమాలని మారిస్తే నా లోక రచన లో శిల్పం దెబ్బతింటుంది. నా శిల్పం మీకు అర్ధం కాదులే . అది “అధిభౌతిక శిల్పం”. శిల్పాన్ని దెబ్బతీయటం ఉచితం కాదు కదా? “
“నీ ఉనికిని మా శాస్త్ర వేత్తలు ఎప్పటికైనా నిరూపించగలరా ?”
“సిధ్ధాంతపరం గా నిరూపించవచ్చు. కానీ నేనుండే లోకం వేరు.నా కొలతలు వేరు. మీకు నా లోకం లోకి ప్రవేశం లేదు. నా లోకం, మీ లోకం లోని నియమాల ప్రకారం పని చేయదు. మీ లోకం నా పరిధి లోని ఒక చిన్న నలుసు మాత్రమే! నా ఉనికిని మీ లోకం లోని నిజ జీవితం లోని దృగ్విషయాలాతో నిరూపించటం అయ్యేపనేనా? “
దేవుడు నన్ను మళ్ళీ బ్రతికిస్తాడేమో.నమ్మితే పోయిందేముంది. ఆయన తో మంచి గా మాట్లాడదాం….అనుకొన్నాడు సుందరం లోలోపల. దేవుడికి సుందరం మనసులోని మాటలు వినపడుతూనే ఉన్నాయి.
“స్వామీ, మమ్మల్ని సృష్టించింది నువ్వే కదా..అంటే, మేము చేసే చెడ్డ పనులకి నీకు కూడా బాధ్యత ఉంటుంది కదా..?”
“నువ్వు నెమ్మది గా ఆస్తికుడివై పోతున్నావనుకొంటా..మీకు స్వేఛ్ఛా సంకల్పం ఇచ్చాను కదా?దానిని పరిస్థితులకి అతీతం గా ఉంచుకోవాల్సిన బాధ్యత మీది కాదా?”
“అంటే, మంచి తో పాటు చెడు చేసే స్వేఛ్ఛ కూడా నువ్వే ఇచ్చావన్నమాట!అసలు మనిషి చెడు చేసే ఆస్కారం నువ్వు కలిగించకుండా ఉంటే పోయేది కదా..? ఆ..అయినా, నువ్విచ్చిన స్వేఛ్ఛా సంకల్పం లో ని స్వేఛ్ఛ నేతి బీరకాయ లోని నెయ్యి లాంటిది లే స్వామీ, అవునూ, ఎప్పటినుంచో నువ్వు కనపడితే అడగాలనుకొంటాను స్వామీ. జనాలకి ఇంత బాధలను ఎందుకు పెడతావు. ప్రళయాలూ, ప్రమాదాలూ ఎందుకు సృష్టిస్తావు? నువ్వు చెడ్డ వాడివా, మంచి వాడివా?”
“నేను మాత్రం కావాలని చేస్తానా?మంచి చెడులు మానవ సమాజాలు సృష్టించినవి. అనిర్వచనీయుడనైన నాకు మీ మంచి చెడులను ఎందుకు వర్తింప చేస్తున్నారు?
“కావాలని చేయవా..? అంటే నీ మీదా ఈ ప్రపంచం మీదా నీకు అదుపు లేదా స్వామీ..?”
“అదుపు అనేది, నియంత్రించటం అనేది మనుషుల లక్షణం కాదా? మీ లక్షణాలని నాకు ఆపాదిస్తే ఎలా?”
“సరే..మరి నిన్ను ఎవరైనా అదుపు చేస్తున్నారా? ఎవరైనా సృష్టించారా?”
“నన్నెవరూ సృష్టించలేదు. నాకు కారణం లేదు.నాకు మొదలు లేదు.చివర లేదు. నేనే అన్నిటినీ సృష్టించాను. అన్నిటిలోంచీ నేను వచ్చాను. అన్నీ నేనే. నేనే అన్నీ. కార్య కారణ సంబంధం మీ ప్రపంచం లోది కదా?”
ఈయనకు మొదలు లేదు, చివర లేదంట. నేనడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వకుండా భలే తప్పించుకొంటున్నాడే! అనుకొని, సుందరం, “నీకు మొదలే లేదా? నేను నమ్మను..అదెలా సాధ్యం స్వామీ?”అన్నాడు.
వెంటనే సుందరం కళ్ళముందు వెలుగుతో ఒక వృత్తం ప్రత్యక్షమైంది.
“ఈ వృత్తం చుట్టూ పోతే ఏది మొదలు? ఏది చివర? ప్రతి ప్రదేశమూ మొదలే. ప్రతిదీ చివరే. నీవు ఏది మొదలు అనుకొంటే అదే మొదలు కాదా?”
“నీ ఉదాహరణ ప్రకారం, ప్రతి విషయానికీ ముందు వేరొక విషయం ఆదిగా ఉంది కదా స్వామీ?”
“నా లోకం లో కార్యమూ కారణమూ ఒకే సమయం లో జరుగుతాయి. ఒకే బిందు సమానమైన సమయం లో కాలాలన్నీ ఉంటాయి. ఒక ప్రదేశం లోనే అనేక వస్తువులు ఉంటాయి. “
”ఏంటో! మా క్వాంటం తీరీలూ, స్ట్రింగ్ తీరీలూ చెప్పినట్లు గా నువ్వు మాట్లాడుతున్నావు. ఇంతకీ, నువ్వు ఏ కాలం లో ఉన్నావు స్వామీ?”
“అన్ని కాలాలలోనూ ఉన్నాను. కొండమీది నుంచీ చుట్టుపక్కల చెట్లన్నీ కనపడినట్లే, నాకు కాలాలన్నీ ఒక్క క్షణం లోనే కనపడుతాయి. ఏ కాలాన్నైనా నేను స్పృశించగలను. అన్ని కాలాలలోనూ నేను ప్రవేశించగలను. కాలాన్ని నేను ఆపగలనూ, పరుగులు పెట్టించగలను. అయితే, నా కాలం మీ కాలం కంటే భిన్నమైనది కదా?”
“ఏమిటో స్వామీ, నన్ను గందర గోళం లోకి నెట్టేశారు. నేను మీలా నిన్నటి వస్తువునీ రేపటి వస్తువునీ ప్రస్తుతం ఎందుకు స్పృశించలేను స్వామీ?”
“నీ లోకం లో కార్యమూ కారణమూ వేర్వేరు గా ఉన్నపుడు, “కార్యమైన నీ ప్రస్తుత లోకం లో ఉన్న నీవు కారణమైన నిన్నటిని ఎలా స్పృశించగలుగుతావు?”
“మీరు మాడైమన్షన్లో ఉన్నట్లు అగుపడటంలా.. ఏ ఆరో డైమన్షన్లోనో..ఏడో డైమన్షన్లోనో ఉన్నారా? ఏదేమైనా, కాలాన్నే అదుపు చేయగల మీరు సామాన్యులు కారు”
“ఇందులో మనుషులు చేసినట్లు గా అదుపు ఏమీ లేదు. కాలమూ, లోకమూ, నేనూ వేరు వేరు కాదు. అంతా ఒక్కటే కాదా?”
“మీరు ఎవరైనా నాకు చేతులు జోడించాలనిపిస్తోంది. ఒక్క సారి నాకు కనపడండి స్వామీ!”
“నేను నిర్గుణుడను, నిరాకారుడను, అనిర్వచనీయుడను, అమేయుడను. నన్ను నీవు చూడలేవు. భక్తి అనేది అమిత బలవంతుడైన ఇష్టుడిని చూసినపుడు మనుషులలో కలిగే ఇష్టం తో కూడిన భయం. దీనికీ మనుషుల మనుగడకీ సంబంధం ఉంది. నీ భక్తి కీ నా ప్రత్యక్షానికీ సంబంధం ఏమీ లేదు.నీ చర్మ చక్షువుల తో నన్ను గ్రహించలేవు. దివ్య చక్షువులివ్వటానికి భక్తి ఒక్కటే సరిపోతుందా?”
“సరే స్వామీ, నా ప్రశ్నలన్నిటికీ మీ ప్రశ్నలతో బ్రహ్మాండం గా సమాధానం చెప్పారు. ఒక్క సారి నన్ను మళ్ళీ బతికించండి స్వామీ!. అరే! ఏదీ సమాధానం రాదే? ఆ దేవుడా పాడా. లేనే లేదు.. లేక పోతే నా ప్రశ్నకు సమాధానం ఎందుకు చెప్పడు?”
చదువుల వలన సృజనాత్మకత తగ్గుతుందా?
28 అక్టో 2011 Comments Off
in సైన్స్ ట్యాగులు:creativity
ఈ మధ్య పత్రికలలో ఒక విషయాన్ని పదే పదే చెప్తున్నారు….. బిల్ గేట్స్ చదువుకోలేదు, న్యూటన్, ఎడిసన్ వంటి శాస్త్రవేత్తలకు చదువు (formal education) లేదు. వికీ లీక్స్ సృష్టికర్త అసాంజ్ కి కూడా చదువు లేదు. కాబట్టీ చదువులు చదవని వారి సృజనాత్మకత ఎక్కువ…. ఈ దృష్టాంతాలను చూపించి మామూలు చదువుల ఉపయోగాన్నీ, ఉత్పాదకతనీ కొందరు పాత్రికేయులు ప్రశ్నిస్తున్నారు. సంచలనాల కోసం చూసే మాధ్యమాలకి దీనివలన కొంచెం మేత దొరక వచ్చు గానీ, దీనిని ఇంకొంచెం దగ్గర గా మనం పరిశీలిద్దాం..
మనలో చాలా మంది పల్లెల లో మూలాలు ఉన్న వారే. మన తో పాటు చిన్నప్పటి స్నేహితులలో కొంత మంది బడి ఎగ్గొట్టి పొలాల వెంబడీ, కాలువలూ చెట్లూ పుట్టలూ పట్టుకొని తిరిగిన వారు ఉంటారు. వారు తరువాత జీవితం లో సృజనాత్మక ఆవిష్కరణలు ఏమాత్రం చేస్తారో మనం ఎరిగిన విషయమే.వారు ఏ గొడ్ల కాపరులు గానో మారుతారు. కాబట్టీ మామూలు చదువులు చదవని వారంతా సృజనాత్మకులైపోరు. చదువులు చదవనంత మాత్రాన సృజనాత్మకత ఉట్టిపడదు. వారు వ్యవస్థీకృత విద్య వలన ప్రభావితం కాక పోయి ఉండవచ్చు. అయినా అందులో సృజనాత్మకత ఏమీ లేదు. చదువుకొంటే కనీసం వారు మామూలు ఉద్యోగాలు అయినా చేసుకొనేవారు.
ఒక ప్రతిభావంతుడైన వ్యక్తి, చదువు లేకుండా పరిశోధన మొదలు పెడితే, ఈ రోజులలో “గురుత్వాకర్షణ సిధ్ధాంతాన్ని”, మళ్ళీ కనిపెడతాడు. ఎందుకంటే, చదువుకోక పోవటం వలన, అతనికి ఆ సిధ్ధాంతం ఇప్పటికే కనిపట్టబడింది అనే విషయం తెలియదు. చదువు వలన ఇప్పటికే సమాధానం దొరికిన సమస్యల గురించి తెలుస్తుంది.
వ్యవస్థీకృత విద్య వలన మనుషుల ఆలోచనా ధోరణులు (thought patterns ) ప్రభావితం(condition) అయ్యే మాట నిజమే! ఏదైనా ఒక కొత్త విషయాన్ని అన్వేషిస్తూ పరిశోధన జరిగినపుడు ,అనేకమైన పరిష్కార మార్గాలను పరిగణించాలి. అవి ఇప్పటికే ప్రయత్నించబడనివి అయి ఉండాలి. కానీ ఈ పరిష్కార మార్గాలలో ఇప్పటికే శాస్త్రపరిజ్ఞానం కొట్టి పారేసినవీ, పని చేయనివీ చాలావరకూ ఉంటాయి.కొన్ని పరిష్కారాలు అప్పటికే వ్యవస్తీకృత విద్యకు తెలిసినవై ఉంటాయి. కొన్ని మాత్రం పని చేసే సరి కొత్త పరిష్కారాలు ఉంటాయి. ఈ కొన్ని పరిష్కారాల విషయం లో వ్యవస్థీకృత విద్య అర్జించిన వారి అలోచనా ధోరణి, అప్పటికే ఉన్న వ్యవస్థ (అప్పటికే ఉన్న పరిష్కారాల) వలన ప్రభావితమై ఉంటుంది. దరిమిలా, వారి ఆలోచనలకు ఈ కొత్త విషయాలలో ఉండే స్వేఛ్ఛ (degree of freedom) తక్కువ గా ఉండే అవకాశం ఉంటుంది. వారు ఈ ప్రభావాల నుండీ బయట పడి(unlearning), స్వేఛ్ఛ గా ఆలోచించటం వీరి ముందున్న ఒక సవాల్. అయితే, రిచర్డ్ ఫేన్మాన్ వంటి చాలా మంది శాస్త్ర వేత్తలు వివిధ రంగాలలో పని చేయటం ద్వారా ఈ పరిమితిని అధిగమించటానికి ప్రయత్నించారు. దీని వలన ఒక రంగం లోఉన్న పరిభావన (concept) ను వేరొక రంగం లో అన్వయించటానికి కుదురుతుంది.
ఇక చదువు లేని కొందరి లో, వారి ఆలోచనా విధానం వ్యవస్థీకృత విద్య వలన ప్రభావితం కాకపోవటం వలన, కొత్త పరిష్కారాలను అన్వేషించటానికి వారికి ఉండే స్వేఛ్ఛ పెరుగుతుందనటం లో సందేహంలేదు. (రాజు గారికి బట్టలు లేవని చిన్న పిల్ల వాడు చెప్పినట్లు).
మనం చిన్న పిల్లల ఆలోచనలలో ఈ వైవిధ్యాన్ని చూడవచ్చు. ఉదాహరణ కి ఒక మొబైల్ ఫోన్ ఒక చిన్న పిల్లవాడికిస్తే వాడు దానిలో మనం అన్వేషించని అనేక విషయాలను ప్రయత్నించి చివరికి దానిని మనకి అర్ధం కాని ఏదో ఒక స్థితికి తీసుకొని వెళ్తాడు. ఈ వైవిధ్యమైన ఆలోచనలలో అన్నీ పనికి రాకపోయినా, కొన్నిటివలన ఉపయోగం ఉంటుంది.అలానే, చదువుకోని వారి కి కూడా ఇటువంటి స్వేఛ్ఛ ఉంటుంది. కానీ అన్ని సమయాలలోనూ ఇటువంటి స్వేఛ్ఛ వలన ఉపయోగం ఉండకపోవచ్చు. ఉపయోగం ఉండే స్థాయిలో ఫలితాలను ఇవ్వగల మేధావులు చాలా అరుదు గానే ఉంటారు.
చదువు వలన ఆలోచనల స్వేఛ్ఛ కొంతవరకూ తగ్గినా, ఆలోచనలకు పదును పెట్టే అనేక పరికరాలు(tools) అప్పటికే ఉన్న సిధ్ధాంతాల, ఆవిష్కరణల రూపం లో దొరుకుతాయి. కాబట్టీ, పిల్లలను చదువులకు దూరం గా ఉంచటం కాక, చదువుకుంటూనే వారు తమ open mindedness ని కోల్పోకుండా ఉంచటం అనేది ఒక చాలెంజ్. వ్యవస్థీకృత విద్య పొందిన అనేక మంది కూడా సృజనాత్మక ఆవిష్కరణలు ఎన్నో చేశారు కదా!
మతమూ, సైన్సూ వాటి ఆవశ్యకత…
24 మే 2010 అభిప్రాయములు
మొన్న రిచర్డ్ ఫేన్మాన్ ఉపన్యాసాలు చదవటం పూర్తి చేసిన తరువాత దానిలోని విషయాల గురించి టపా వేద్దామనుకొన్నా. కానీ టైం లేక, వేయలేక పోయాను.
ఇవాళ ఆకాశరామన్న గారి ఉత్తరం చూస్తుంటే ఫేన్మాన్ చెప్పినవి గుర్తుకొచ్చాయి. అలానే అంతకు ముందు మతం గురించి చాలా వేడి వేడి చర్చలే నడిచాయి(కృష్ణ గారి టపా లో ).
వీటన్నిటి ప్రభావం తో ఆకాశ రామన్న గారి టపాలోకామెంటుదామనుకొంటే ఈ కింది చాట భారతం వచ్చింది.
ఇంత వచ్చింది కదా అని కొత్త టపా మొదలెట్టా. ఈ టపా మతానికి అనుకూలమూ కాదు,ప్రతికూలమూ కాదు. దీన్ని “గోడ మీది పిల్లి” టపా అనుకోండి. ఇది ఎవరి మనోభావాలు దెబ్బతీసేందుకు కూడా ఉద్దేశింపబడలేదు.
హమ్మయ్య డిస్-క్లెయిమర్లు అయ్యాయి కదా, ఇక నా ఆలోచనలు ఇక్కడ…
ఫేన్మాన్ గారి ఉపన్యాసం వలన నాకు అర్ధమైనది ఏమంటే మతమూ సైన్సూ రెండిటినీ కూడా మనిషి తన బాగు కోసమే అభివృధ్ధి చేసుకొన్నాడు. చూడండి మనిషి ఎంత స్వార్థ పరుడో! కాబట్టీ మనిషి కోసం మతమూ,సైన్సూ. మతమూ,సైన్స్ కోసం మనిషి కాదు. అలానే చివరికి మనిషి కోసం కమ్మ్యూనిజం, కాపిటలిజం మొదలైన సిధ్ధాంతాలు. సిధ్ధాంతాలు సిధ్ధాంతాలకోసం మాత్రం కాదు.
మతం సరైనదై మనిషి దారి తప్పినప్పుడు నాగరిక సమాజం మనిషిని ముందు దారిలోకి తేవాలి.
మతమూలేక సైన్స్ ఒక కత్తి అనుకొంటే, కత్తిని తయారు చేయటం లోనే మనిషికి స్వార్థం ఉంది. అది తన సర్వైవల్. అలాంటి మనిషి కత్తిని స్వార్థం కోసం ఉపయోగించడని గారంటీ ఏమీ లేదు. కత్తిని పొదలను నరికే మంచి పనికీ వాడవచ్చు. అలానే ఎదుటి వాడి గొంతు కోసే చెడ్డ పనికీ వాడ వచ్చు. ఈ రెండిటిలోనూ కత్తి తప్పు ఏమీ లేదు అది ఉపయోగించే మనిహి తప్పు. ఇక్కడి వరకూ సూటి గా ఉంది కదా. సమస్య కొన్ని తుప్పు పట్టిన కత్తులు మనిషి తమను ఎలా ఉపయోగించ గలడో తమ( కత్తుల) చేతుల్లోనే ఉంది అని భ్రమ కలిగించినపుడు…….
సైన్స్ అనేది ఈ ప్రపంచం ఎలా పని చేస్తుందో చెప్తుంది. కానీ మనుషులు ఏ దిక్కులో వెళ్ళాలో చెప్పలేదు. అలానే ప్రపంచం ఎందుకు పని చేస్తుంది? మనుషులు ఎలా ప్రవర్తించాలి అనే విషయాలు సైన్స్ కి తెలియదు. మనుషులు ఏ దిక్కులో వెళ్ళాలో మతం చెప్తుంది. ఐతే ఒక్కోమతం ఒక్కో దిక్కు సూచిస్తుంది. దీని వలన హింస పెరుగుతుంది. అందుకే మానవ జాతి అంతటికీ ఆమోద యోగ్యమైన దారి కనపడే దాకా మనం మన మనసు ని అన్ని మార్గాలకూ తెరుచుకొని ఉంచటం మంచిది.
సైన్స్ పరిశీలనా ప్రధానమైనది. మతం ఇంగితం తో కూడుకొన్నది. సత్య శొధన కు పరిశీలన ఒక్కటే మార్గం కాదు. ఇంగితం కూడా ఒక మార్గమే. ఐతే ఈ మార్గం సైన్స్ లో పనికి రాదు. మతానికి ఇంగితమే (ఇన్ ట్యూషన్) ప్రధానం.
ఇది చదివిన తరువాత మతం యొక్క ఆవశ్యకత గురించి నాకు కొంత క్లారిటీ కలిగింది…
జంతువులకి మతం లేదు. మనిషికి మతం ఉంది. అంటే మనిషి జంతువుల నుంచీ పరిణామం చెంది ఆలోచనలో కొంత స్థాయి వచ్చిన తరువాత మతం వచ్చింది.మతం కంటే ముందే మనిషి లోని లక్షణాలనీ ఏర్పడ్డాయి. కాబట్టీ మనిషి చేసే వెధవ పనులన్నిటికీ మతానిది బాధ్యత కాదు.మతం ఆధీనం లో లేని అనేక విషయాలు మనిషి లో ఉన్నాయి.
అలానే పాపులర్ మతం చెప్పుకొంటున్నట్లు మతం సర్వ రోగ నివారిణి కాదు. మీరు ఎప్పుడైనా క్రీస్తు సువార్త సభలో, లేక కొందరు బాబాల సభలో వింటే వాళ్ళు “మతానికి సాధ్యం కానిది లేదు” అనే భ్రమ కలిగిస్తారు. మీరు మా దేవుడిని/మతాన్ని నమ్మండి ఏదైనా సంభవం అంటారు. బహుశా అసలైన మతాధీశులు (చంద్రసేఖర సరస్వతి వారు కానీ, శంకరాచార్యులు కానీ, లేక క్రీస్తు కానీ) ఇలంటి క్లెయింస్ ఎప్పుడూ చేయరనుకుంటా…! ఒక మతాన్ని నమ్మిన వాడు ఏదైనా నేరం చేయగానే “వాడు నిజం గా మావాడైతే అలా చేయడు. కాబట్టీ వాడు మా వాడే కాదు” అనటం అవకాశ వాదం. నేరం చేసేదాకా మా వాడే అన్నప్పుడు, నేరం చేసిన తరువాత కూడా మా వాడే అనాలి కదా.ఒక మతాన్ని నమ్మినంత మాత్రాన అతని వ్యక్తిత్వాన్ని మతం మార్చలేక పొయింది. ఒక
పెద్ద స్వామి హిందూ మతానికి అత్యున్నతమైన పదవి లో ఉన్నారనుకొందాం. ఆయనకు తెలియని ధర్మం లేదు. కానీ ఇవన్నీ తెలియటం అనేది ఆయనను ఒక హత్య చేయించకుండా ఆపలేక పోయింది అనుకొందాం. హత్య చేయించాడు అని తెలిసిన వెంటనే “ఆయన హిందువే కాదు” అనటం సబబు కాదు. హత్య చేసిన తరువాత కూడా ఆయన హిందువే! కానీ హిందూ మతం తెలిసినంత మాత్రాన, వాటిలో కొన్ని పధ్ధతులు ఆచరించినంత మాత్రాన, మనిషి మంచి వాడైపోడు. అతని లో స్వతహా గా ఉన్న చెడ్డతనం ఎక్కడికీ పోలేదు.(అందరూ ఈ పెద్ద స్వామి లాంటి వారని కాదు. చాలా మంది మతావలంబకులలో మంచి వారే ఉంటారు. ఆ మంచి తనానికి కారణం ఒక్కోసారి మతమే అవుతుంది. ఒక్కోసారి కాదు కూడా.) పెద్ద స్వామి చెడు ఆలోచనని మతం హరించలేక పోయింది.ఈ విషయాన్ని అన్ని మతాలలోని అసలైన ప్రవక్తలు చెప్పినదే.కాక పోతే పాపులర్ మతాలు (బాబాలూ గట్రా) మతం అనేది సర్వ రోగ నివారిణి అని చెప్తాయి. అరచేతి లో వైకుంఠం చూపిస్తాయి.
మత గ్రంధాలు మార్గ దర్శకాలు మాత్రమే. కానీ మమూలు జనాల మూర్ఖత్వం/మూఢత్వం వలన అవి జీవితం లో ఫత్వా ల స్థాయికి దిగజారిపోయాయి.మార్గదర్శకాలు జీవితాన్ని శాసించవు. కానీ నిత్య జీవితం లొ మతాలు రాజకీయాల నుంచీ, ఆర్ధిక సమస్యల దాకా అన్నిటినీ శాసించే స్థాయి కి దిగ జారిపోయాయి. ఈ దిగజారుడు కి మతాని కన్నా జనాల మూర్ఖత్వాన్నే నిందించాలి.
పాపులర్ మతాల వలన కూడా కొన్ని లాభలున్నాయి..పాపభీతి, సమస్యలు వచ్చినప్పుడు దైవం పై ఆశ, నీతి, పధ్ధతి ఇవన్నీ మతం వలననే వచ్చాయి. ఇవిలేకుండా జీవితం ఇంకా దుర్భరమౌతుంది.
బందిపోటు దొంగకి భాగవతం వలన ఉపయోగం ఏమిటి? వాడికి భాగవతాన్ని ఇచ్చినా వాడు అది చదివి మారిపోడు. దాని వలన భాగవతం పనికి రానిది కాదు. అలానే భాగవతం రాసినాయన “బందిపోటు దొంగ భాగవతం చదివి ఆనందించి మారిపోతాడని” చెప్పటం కూడా సరి ఐనది కాదు. వాడికి భాగవతం ఉపయోగం లేనిది. అదే ఏ భక్తుడి చేతిలోనో పడితే అప్పుడు అది ఉపయోగపడుతుంది. అయితే ఈ భక్తులు మన సమాజం లో నానాటికీ తగ్గిపోతున్నారు.జనాలకు తోలు మందం ఎక్కువయ్యింది. అందువలనే ఇలాంటి జనాలని డీల్ చెయ్యటానికి మావోఇజం లాంటి కొత్త హింసాత్మక మార్గాలు పుట్టుకొస్తున్నాయి.
అలానే సైన్స్ కూడా…స్వర్గానికీ నరకానికీ ఒకే తాళం చెవి ఉంది. ఆ తాళం చెవి మనిషికి సైన్స్ ఇస్తుంది. మసిషి అ తాళం చెవి తో స్వర్గ ద్వారాలు తెరుస్తాడొ, లేక నరక ద్వారాలు తెరుస్తాడొ అతని చేతుల్లో ఉంది. మనిషి నరక ద్వారాలు తెరిస్తే అది సైన్స్ తప్పు కాదు. అలా అని స్వర్గ ద్వారాలు తెరిచినా అది సైన్స్ గొప్పదనం కాదు. సైన్స్ గొప్పదనం తాళపు చెవి ని తయారు చెయ్యటం వరకే! మనిషి స్వర్గ ద్వారాలు తెరవాలా లేక నరక ద్వారాలు తీయాలా అనే విషయమై కొంత మతం అతనికి సలహా ఇవ్వగలదు. కానీ మనిషి మతం సలహా ని పెడచెవిన పెట్టి నరక ద్వారాలు తెరిస్తే మతం చేయ గలిగింది ఏమీ లేదు.తాళపు చెవి తో నరక ద్వారం తెరిచే కంటే, తాళపు చెవి అసలు లేక పోవటమే మంచిది అనిపిస్తుంది, ఈ గ్లోబల్ వామింగ్ కాలం లో. అలానే మతంస్వర్గ ద్వారం తెరవరా నాయనా అంటే, మనిషి నరక ద్వారం తెరిచినప్పుడు కూడా, ఈ మతాలు లేకపోతే బాగుంటుంది కదా అనిపిస్తుంది. లేక పోతే మనిషి చేత స్వర్గ ద్వారం తెరిపించలేని ఈ మతాలెందుకు అనిపిస్తుంది. సమస్య అంతాఈ మనిషి తోనే వచ్చింది అని తిట్టుకోవటం మన స్వప్రేమకు అడ్డు కదా! కానీ సమస్య అంతా మనిషి మానసికవ్యవస్థ తోనే వచ్చింది. ఈ వ్యవస్థ ని గాడిలో పెట్టనంత వరకూ మతానికి ప్రయోజకత్వం రాదు.
ఇక పోతే నాస్తికత్వం గురించి…నాస్తికత్వం కూడా ఒక నమ్మకమే. ఎందుకంటే,మీరు ఒక నాస్తికుడిని “ఈ విశ్వం ఎక్కడినుంచీ వచ్చింది? దీనిని ఎవరు సృష్టించారు” అని అడిగితే, “నాకు తెలియదు కానీ దేవుడు మాత్రం లేడు”, అని చెప్తాడు. అంటే ఇదీ ఒక నమ్మకమే.కాబట్టీ మతం గురించి మనం పైన చెప్పుకొన్న వాటిలో నాస్తికత్వానికీ, కమ్యూనిజానికీ కూడా వర్తిస్తాయి. కాకపోతే నాస్తికుడికి, ఆస్తికుడిలా పెద్ద ప్రవర్తనా నియమావళి ఉండదు. నాస్తికుడికి పాప భీతీ దైవ భీతీ ఉండకపోవటం వలన వాడు అంతరాత్మ లేని వాడైతే వాడి వలన సమాజానికి చాలా నష్టం. ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు అని అడిగితే, “నాకు తెలియదు. అది నా ఊహ కు అందని విషయం” అనే వాడిని ఇంగ్లీష్ లో ఆగ్నోస్ట్ అంటారు.
మనిషికి ఈ కాలం లోకూడా చాలా వరకూ ఆచరణ శీలమైన విలువల వ్యవస్థ ల లో కుటుంబ వ్యవస్థ ఒకటి. మనిషి పరిణామ క్రమంలో జ్ఞాపక శక్తి, అంతశ్చేతన పెరగటం వలన జంతువుల నుంచీ వేరుపడ్డాడు. అందువలన ఈ వ్యవస్థలు ఏర్పడ్డాయి. అమ్మా నాన్న అక్కా తమ్ముడూ అనే భావాలు ఇలాంటివే. కాబట్టీ మనిషి భౌతికమైన, పరిణామ పరమైన అవసరాలకు అనుగుణం గా ఏదైనా విలువల వ్యవస్థ ఉంటేనే అది తట్టుకొని నిలబడుతుంది. “ఈ అవసరాలకు భిన్నం గా ఉన్న వ్యవస్థను” ఆచరించే వారు కరువౌతారు. అప్పుడు ఆ వ్యవస్థ మార్గదర్శకాలకూ, ఆ వ్యవస్థ లోని మనుషుల ప్రవర్తన కూ మధ్య అంతరమెక్కువౌతుంది. ఆచరణ సాధ్యం కాని ఏ విలువల వ్యవస్థ ఐనా ఉపయోగం లేనిది గా తయారౌతుంది. కేవలం పుస్తకాలకే పరిమితమౌతుంది. ఆచరణ లో పెట్టలేని గొప్ప విలువల వలన ఉపయోగం లేదు. అలాని ఏ బంది పోటు దొంగో తనకు అనుగుణం గా వ్యవస్థ లోని విలువలను దిగజార్చమనటం కూడా సరి కాదు. విలువలు ఉండాలి కానీ అవి ఆచరణాత్మకం గా, మానవాళి సమిష్టిమరియూ వ్యక్తిగత మనుగడ కిమంచి చేసేవి గా ఉండాలి. ఒక యుగంలో ఉన్న విలువలు వేరొక యుగం లో అవసరం లేనివి ఔతాయి కాబట్టీ ఈ విలువలు కూడా చలనశీలమైనవి. మంచి చెడులు చలనశీలమూ, సాపేక్షమూ ఐనట్లే సమాజపు విలువలు కూడా.
కొత్త వ్యవస్థ ఏదైన తీసుకొని వచ్చేటపుడు, అది ఉన్న వ్యవస్థ కంటే మెరుగైనది గా ఉండాలి. కొత్త వ్యవస్థ మెరుగైనదా కాదా అనే విషయం, కొత్త వ్యవస్థ ని పరిమితం గా ఒక ఊళ్ళొనో, ఒక జిల్లాలోనో ఒక ప్రొటో టైప్ లా ప్రవేశపెట్టి అది సాధ్యమా కదా,ఒక వేళ సాధ్యమైతేఅది పాత వ్యవస్థకన్నా మెరుగైనద లేదా అని చూడాలి. ఒక వేళ మెరుగైనదైతే, దానిని పరిమిత కాలం పాటు విస్తరించి చూడాలి. అప్పుడు కూడా కొత్త వ్యవస్థ లో లోపాలు కనబడితే దానిని వెనుకకు తీసుకొనేటందుకు సిధ్ధం గా ఉండాలి. చివరికి కొత్త వ్యవస్థే మెరుగైనదైతే దానిని కొన సాగించాలి. అంతే గానీ కమ్యూనిజం లా “కొండ నాలిక కి మందేస్తే ఉన్న నాలిక ఊడింది” అన్న చందాన ఉండకూడదు.
ఇంకా చాలా విషయాలున్నాయి కానీ..అవన్నీ మళ్ళీ ఇంకొక సారి…?(మీకు చదివే ఓపిక ఉంటే..)
రిచర్డ్ ఫేన్మేన్ మతం,సైన్స్ గురించి ఇచ్చిన ఉపన్యాసాలు
20 మే 2010 అభిప్రాయములు
in సైన్స్ ట్యాగులు:Richard Feynman's lectures
రిచర్డ్ ఫేన్మేన్ ప్రపంచ ప్రసిధ్ధ భౌతిక శాస్త్రవేత్త. ఆయన 1965 లో భౌతిక శాస్త్రం లో నోబెల్ బహుమతి గెలుచుకొన్నారు.
ఆయన సైన్స్, మతం గురించి ఇచ్చిన ఉపన్యాసాలు ఇక్కడ ఉన్నాయి ఆంగ్లం లో. ఇది కొంచెం పెద్ద డాక్యుమెంట్. తీరిక చేసుకొని అప్పూడప్పుడూ చదవ వచ్చు.
