జనాల మీదకి బూమరాంగ్ కా బోతున్న జనాలతీర్పు

ఈ మధ్య నితీష్ కుమార్ బిహార్ ఎన్నికల్లో గెలవటం గురించి మీడియా “ఇది అభివృధ్ధికి ప్రజలు వేసిన వోటు” అని ఊదరకొట్టింది. కానీ నాకు నమ్మబుధ్ధి కాలేదు.
మన రాష్ట్రం లోనే ఒక పది సంవత్సరాలు వెనక్కి వెళ్తే …
చంద్ర బాబు ఎన్నికల్లో గెలిచి రెండవ సారి అధికారం లోకి వచ్చాడు. అప్పుడు కూడా మీడియా ఇలానే అభివృధ్ధి కీ వోటు అని చెప్పింది.
తరువాత చంద్ర బాబు నా దృష్టి లో మంచివైన రెండు విషయాలలో సరిగా వ్యవహరించాడు.
1. దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకోవటం…. విద్యుత్ సంస్కరణల విషయం లో కానీ, …అనేక కార్పొరేట్ సంస్థలను రాష్ట్రానికి తీసుకొని రావటం లో కానీ చంద్ర బాబు చేసినది సరైనదే అనుకొంటాను
2. ప్రభుత్వ యంత్రాంగం యొక్క నిష్పాక్షికత: కొంతవరకూ, పార్టీ కీ వంది మాగధులకూ ప్రభుత్వం లో ప్రాబల్యాన్ని తగ్గించటం.దీని వలన దిగువ స్థాయి లో అవినీతి ని తగ్గింది.

కానీ తరువాతి ఎన్నికలలో ఈ రెండు పధ్ధతులూ చంద్ర బాబుకి వ్యతిరేకం గా పని చేసి అతన్ని మట్టిగరిపించాయి. వై ఎస్ ఆర్ ఉచిత విద్యుత్తూ, ఇతర వరాలూ, సామాజిక, రాజకీయ సమీకరణ లూ అతన్ని ముఖ్యమంత్రిని చేశాయి.
వై ఎస్ ఆర్ చంద్ర బాబు కి పూర్తి భిన్నం గా వ్యవహరించి అస్మదీయులకు పట్టం గట్టారు. అనేక ప్రజాకర్షక పధకాలు ప్రవేశ పెట్టి రెండవ సారి కూడా అధికారం లోకి రాగలిగాడు.
ఈ సమయం లో చంద్ర బబు తన గుణపాఠాలను నేర్చుకొన్నట్లు కనపడుతోంది. ఆయన రైతుల పేరు తో దీక్షలు చేస్తున్నారు.ఉచిత వాగ్దానాలు చేస్తున్నారు.  వీటన్నిటితోనూ జనాలలో ఆవేశ కావేశాలను రెచ్చగొట్టి మళ్ళీ వచ్చేఎన్నికల్లో అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన మళ్ళీ అధికారం లోకి వస్తే ఇక దీర్ఘ కాలిక విధానాలకు ఇంతకు ముందు ఇచ్చిన ప్రాముఖ్యత ఇవ్వక పోవచ్చు. అలానే అస్మదీయులను ప్రభుత్వ కార్యకలాపాల నుంచీ దూరం గా పెట్టేతప్పు? చేయక పోవచ్చు.
ప్రజాస్వామ్యం లో ఉన్న ఒక లొసుగు ఏమిటంటే “జనాలకు తగ్గ పాలకులు” వస్తారు. యధా ప్రజా తధా రాజా. అలానే జనాలు తీసుకొనే అనాలోచిత నిర్ణయాలకు చివరికి జనాలే బలవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు జనాల ను ఎలా మభ్య పెట్టి అధికారం లోకి రావాలా అని చూస్తాయి. అందుకే జనాల తీర్పు జనాలమీదికే బూమర్యాంగ్ అవుతుంది.